బాబు మళ్లీ వస్తే అవినీతిని ప్రోత్సహించినట్టే
ఆయన రాజకీయాల నుంచి రిటైరవ్వాలి
రాహుల్ వద్దకు వెళ్లి తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్
జగ్గంపేట/ఏలేశ్వరం/ప్రత్తిపాడు రూరల్: ‘అనుభవజ్ఞుడని 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని చేశాం. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కంటే రెట్టింపు స్థాయిలో అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో మూడు దశాబ్దాలు వెనక్కి నెట్టిన కాంగ్రెస్తో జత కట్టారు. 2019 ఎన్నికల్లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని యువతరానికి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాం’ అని చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. జనపోరాట యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ నాయకులు బాబు మళ్లీ రావాలని హోర్డింగ్లు పెడుతున్నారని ఆయన మళ్లీ వస్తే నీతి అనేదే ఉండదని, అంతటా అవినీతే ఉంటుందన్నారు. ఏపీకి దెబ్బతీసిన, మన ఎంపీలను కొట్టిన కాంగ్రెస్తో కలుస్తున్నారని, రాహుల్గాంధీకి పాదాభివందనం చేయడం సిగ్గుచేటన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఖజానాకు భారం లేకుండా రైతులు, కౌలు రైతులకు న్యాయం చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా మహిళా బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు.
వంతాడ మైనింగ్లో అన్నీ అక్రమాలే..
కోట్లాది రూపాయల ఆదాయాన్నిచ్చే వంతాడ గనుల్లో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ విమర్శించారు. గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం వంతాడ గ్రామ సమీపంలోని లేటరైట్ గనులను ఆదివారం ఆయన పరిశీలించి, గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ మైనింగ్ నిమిత్తం తమ భూములు అక్రమంగా తీసుకొని, తమకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ దిగువ నుంచి పైపులైను ద్వారా తాగునీరు అందించాలని కోరారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో మైనింగ్ దోపిడీ రెట్టింపు అయిందని ఆరోపించారు. గిరిజనులు తమ హక్కులకై పోరాడాలని వారికి సంపూర్ణ మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెద్దిపాలెంలో ఏలేరు కాలువ, చంద్రబాబు సాగర్ ఆయకట్టు రైతులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏలేరు జలాశయం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కు వెళ్తున్న జలాలను స్థానిక రైతులకు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.
అబద్దాలు చెప్పడం ఆపండి సీఎం గారూ!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సహా మరికొందరు నాయకుల అవకాశవాద రాజకీయాలు, వారు చెప్పే అబద్ధాలు ప్రజలు భరించలేకపోతున్నారని జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి అబద్దాలు చెప్పడం ఆపండి బాబోయ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘నోరు చేసే అఘాయిత్యానికి పొట్ట భరించలేదు అన్న సామెత లాగా.. ముఖ్యమంత్రి గారూ, అవకాశవాద రాజకీయాలతో, పూటకొక మాట మార్చే రాజకీయ నాయకులతో ప్రజలు విసుగు చెంది ఉన్నారు. అలిసి పోయి ఉన్నారు. ఇంకా మీ నోటితో ప్రజలు మీద చేసే అఘాయిత్వాలు ఆపేసేయాలి. ఇక భరించలేకుండా ఉన్నాం.’ అని పవన్ ట్వీట్ చేశారు.
సంబంధిత వార్తలు