టీడీపీకి సిగ్గూ.. శరం లేదు

Pawan kalyan Sensational Comments On Chandrababu and TDP - Sakshi

ఘాటుగా విమర్శించిన పవన్‌కల్యాణ్‌

ఏలేశ్వరం/శంఖవరం: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌ పార్టీకి తాకట్టు పెట్టిన టీడీపీకి సిగ్గూ.. శరం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఘాటుగా విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెలుగు దేశం పార్టీని రాహుల్‌ గాంధీ మోకాళ్ల కింద మొకరిల్లేలా చేశారని చంద్రబాబును దుయ్యబట్టారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో ప్రజా పోరాట యాత్రలో భాగంగా శనివారం బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన కాంగ్రెస్‌తో జత కట్టడం ఎంత వరకు సమంజసమన్నారు.

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే డబ్బులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పినా.. ఎన్నికలు పెట్టేందుకు చంద్రబాబు వెనుకాడుతున్నారని విమర్శించారు. పంచాయతీ మెంబర్‌ కాలేని లోకేష్‌ను  పంచాయతీరాజ్‌ శాఖా మంత్రిగా నియమించడంపై ఆక్షేపించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కలసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబులా ఊసరవెల్లిని తలదన్నే రీతిలో అవకాశవాద రాజకీయాలు చేయడం తమకు చేతకాదన్నారు. మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అన్నవరంలో జరిగిన డ్వాక్రా మహిళల ముఖాముఖిలో పవన్‌ పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top