‘ఎన్నికల ప్రచారం నేటి నుంచే మొదలు’
నూతన సంవత్సర వేడుకల సభలో జనసేన పార్టీ అధినేత పవన్
సాక్షి, అమరావతి: మూడు, నాలుగు నెలల్లో జరగబోయే అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు మంగళవారం నుంచే విజయవాడ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్టు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ ప్రకటించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ‘2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టి నుంచే శ్రీకారం చుడుతున్నాం. అందరం కష్టపడి జనసేన పార్టీని గెలిపించుకుందాం. జన సైనికులు ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేయాలి’ అని అన్నారు. నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉండాలని, ఆ భవిష్యత్తు పునర్నిర్మాణంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించాలని వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పవన్కళ్యాణ్కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా పార్టీ నాయకులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు పవన్కల్యాణ్ బుధవారం జిల్లాల వారీగా భేటీ కానున్నారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రోజుకు రెండు మూడు జిల్లాల నేతలతో సమావేశమవుతారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.