ఐటీ దాడులపై పవన్ కామెంట్
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆదాయపన్ను శాఖ దాడులపై మాట్లాడాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కార్యాలయం మీద ఐటీ దాడులు జరిగితే అండగా నిలబడేవాళ్లం. ఎవరో రాజకీయ నాయకులు, బ్రిక్ ఫ్యాక్టరీల మీద, ప్రైవేట్ వ్యకులు మీద జరిగే స్పందించాలా’ అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు 14 సార్లు మాట మార్చారని విమర్శించారు. చంద్రబాబు అనుభవం మాటలు మార్చడానికి ఉపయోగపడుతుందని, సీఎం మాట మార్చడం వలన భావితరాలకు నష్టం జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. మోదీ తనకు బంధువు కాదని, బీజేపీని తానెప్పుడూ వెనకేసుకు రాలేదని తెలిపారు.
‘ముందస్తు’ అవసరం లేదు
తెలంగాణ శాసనసభా ఎన్నికలపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ... ముందస్తు ఎన్నికలు రావాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో 24 స్థానాలకు పోటీ చేయాలనకుంటున్నామని, నాలుగైదు రోజుల్లో దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్టు చెప్పారు.