అతి విశ్వాసం పనికి రాదు
అందుకే కరీంనగర్లో ఓడిపోయాం
టీఆర్ఎస్ కోసం రోజూ గంట పనిచేయండి
స్థలం ఉన్నోళ్లకు ఇంటి నిర్మాణానికి సాయం
మధ్యమానేరు నిర్వాసితులతో అనవసర రాజకీయం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అతివిశ్వాసం పనికి రాదని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం పార్టీ బూత్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంతో బలంగా ఉందనే అతినమ్మకంతోనే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్లో ఓడిపోయామని, ఫలితంగా మంచి నాయకుడిని కోల్పోయామని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం అతివిశ్వాసంతో అలసత్వాన్ని ప్రదర్శించామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీలో సగం వచ్చినా ఎంపీ సీటు గెలిచేవాళ్లమని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు రోజూ గంటసేపు పార్టీ కోసం పనిచేస్తే చాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచి్చనా క్షేత్ర స్థాయిలో గులాబీ సైనికులు సిద్ధంగా ఉండాలని కోరారు.
ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి
70 ఏళ్లలో చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. సర్కారు ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచేందుకు కేసీఆర్ కిట్లను అమలు చేసిందని, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో బాల్యవివాహాలను తగ్గించిందన్నారు. రాష్ట్రం ఏటా రూ.12 వేల కోట్ల పింఛన్లు ఇస్తుంటే.. కేంద్రం ద్వారా కేవలం రూ.200 కోట్లు వస్తున్నాయని ఆయన వివరించారు. ఉప్పేసి పొత్తు కూడినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. ‘రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు పంచాలి’లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
సొంతస్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకోడానికి ప్రభుత్వం సాయం అందిస్తుందని కేటీఆర్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఇంటికి వెళ్లినా.. ఏదో ఒక రూపంలో ప్రభుత్వ లబ్ధిని పొందిన వారే ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు చెప్పాలని, ఇంకా ఏం కావాలో తెలుసుకోవాలని సూచించారు. మధ్యమానేరు నిర్వాసితులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మెరుగైన పరిహారం ఇచ్చి రూ.350 కోట్లు అదనంగా నిర్వాసితులకు అందించామన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి నేత కారి్మకులే ప్రచార కర్తలని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల నేతన్న చౌక్లోని విగ్రహానికి ఆయన పూలమాల వేశారు.
గోదావరి జీవనది అయింది
కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నది 150 కిలోమీటర్ల మేరకు నిండా నీటితో జీవనదిగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. నీరుంటే.. బీడు భూములు సస్యశ్యామలం కావడంతోపాటు మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఒకే పంటను రైతులందరూ వేయకుండా సీఎం సూచించిన విధంగా పంట కాలనీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించాలని కోరారు. హరితహారాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టాలన్నారు. అన్ని గ్రామాల్లోనూ డంపింగ్ యార్డులను, వైకుంఠ ధామాలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.