ఓట్ల కోసం రాజకీయాలు చేయం: మోదీ
సాక్షి, లక్నో: ఓట్లకోసం రాజకీయాలు చేయమని, పార్టీ కన్నా దేశ ప్రజలే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తన సొంత లోక్సభ స్థానమైన వారణాసీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం షాహన్షాపూర్లోని రైతు సదస్సులో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్తో కలిసి పశుదాన్ ఆరోగ్య మేళాను ప్రారంభించారు. అనంతరం అర్హులైన రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుదాన్ మేళాతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు లబ్ది పొందుతారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు పశుదాన్ మేళాలు నిర్వహించలేదన్నారు.
పశుఆరోగ్య మేళాను ఏర్పాటు చేసిన సీఎం యోగిఆదిత్యానాథ్ను మోదీ ప్రత్యేకంగా అభినందించారు. స్వచ్ఛతా నుంచి స్వభావం వస్తుందని, స్వచ్ఛత పాటించడం మన ప్రాథమిక కర్తవ్యమని పేర్కొన్నారు. పరిశుభ్రత భారత్ త్వరలోనే ఆరోగ్య భారత్గా మారుతుందన్నారు. అంతకు ముందు యూపీ సీఎంతో స్వచ్ఛ్ అభియాన్లో భాగంగా టాయిలెట్ ఫౌండెషన్కు శంఖుస్థాపన చేశారు. 67 ఏళ్ల షాజహాన్పూర్ గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశువుల ఆసుపత్రితో పాటు పాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్చతా సేవ’ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా క్రికెటర్లు, సినీతారలకు ప్రధాని పంపించిన లేఖలకు విశేష స్పందన లభిస్తుంది. మోదీ లేఖకు క్రికెటర్లు, సినీ నటులు ట్వీట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.