చంద్రబాబు ఒక్కటైనా నిజం చెప్పారా?: మంత్రి అనిల్‌ కుమార్‌

No truth behind Chandrababu allegations, says Anil Kumar Yadav  - Sakshi

సాక్షి, అమరావతి:  వరదలపై మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను జన వనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కృష్ణానదికి సంభవించిన వరదలు ప్రకృతి వైపరీత్యం వల్ల కాదని.. ప్రభుత్వ వైపరీత్యమే అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను మంత్రి అనిల్‌ కుమార్‌ దీటుగా  తిప్పికొట్టారు.

‘చంద్రబాబు ఇవాళ పెట్టిన ప్రెస్‌మీట్‌ చూశాను. ఒకటైనా నిజం చెప్తారేమోనని ఆశించాం. కొన్ని ప్రాంతాల్లో వరద వల్ల ఇబ్బండి పడిన ప్రజల గురించి మాట్లాడతారని అనుకున్నాం. కానీ, ఆయన  మాట్లాడిన అంశాలు ఏంటంటే... రిజర్వాయర్‌లో కట్టుకున్న తన ఇల్లు ఎలా మునిగిపోయిందనేది. ఆ  ఇంటి మునకకు డ్రోన్‌తో చూపించే ప్రయత్నం ఎందుకు చేశారనేది. ప్రకాశం బ్యారేజీకి అంత వరద ఎలా వచ్చిందన్నది. తాను రాజధానిగా చెప్పిన పల్లపు ప్రాంతంలోకి నీరు ఎలా చేరిందనేది. ఇది ప్రకృతి విపత్తు కాదు, మానవ విపత్తు అంటూ మాట్లాడారు. చింత చచ్చిన పులుపు చావలేదనేది సామెత. చివరకు వరదల్లో కూడా హైటెక్‌ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు. మైకేల్‌ జాక్సన్‌ మైకు... పవర్‌ పోయిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌... ఇదీ చంద్రబాబు ప్రెస్‌మీట్‌. 

రాయలసీమలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని కడప జిల్లా ఎడిషన్‌లో ఈనాడు ఒక పూర్తి పేజీలో వార్త రాసింది. మరోవంక బాబుగారు మాత్రం సీమకు నీళ్లు తరలించడం లేదంటారు. ఇవన్నీ చూస్తుంటే ...అందరికీ అర్థమయ్యేది ఏంటంటే... తన అయిదేళ్ల పాలనలో ఒక్క సంవత్సంలో కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచిందల, ప్రకాశం బ్యారేజీ కాని నిండలేదని, తాను కరువు నాయకుడునని ప్రజలకు బాగా అర్థం అయ్యిందని చంద్రబాబు బాధపడుతున్నారు. 

దేవుడి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ రెండు నెలల్లోనే ప్రకృతి సహకరించి ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిగా నింపడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కరువుతో అల్లాడుతున్న సీమకు శ్రీశైలం నుంచి తరలిస్తున్న నీళ్లే ప్రాణాధారంగా మారుతుండటాన్ని బాబు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది పంటల పండబోతున్నాయన్న సూచనలు కనపడేసరికి బాబుకు ఎంతో బాధగా ఉన్నట్లుంది. వరదలు మేన్‌ మేడ్‌ అంటున్న బాబు, కరువు తన మేడ్‌ అని ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. వరదలు మేం సృష్టించామంటున్న బాబుగారు, కరువును తానే సృష్టించారేమో. 

ఎంతసేపు మాట్లాడినా నా ఇల్లు ముంచేయడానికే అంటున్న బాబు వాస్తవానికి అయిదేళ్ల పాలనతో తన కొంప, తన పార్టీ, తనను నమ్ముకున్న కార్యకర్తల కొంప ఏప్రిల్‌లోనే ముంచేశారు. ఎడారి నడుమ ఇల్లు కట్టుకుని నీళ్లు ఇవ్వలేదని ఎవరన్నా ఏడిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో...రిజర్వాయర్‌ మధ్య ఇల్లు కట్టుకుని తన ఇల్లు ముంచేశారని ఎవరన్నా ఏడిస్తే అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. 

ఇన్ని మాట్లాడిన మీరు కోడెల శివప్రసాదరావు ఏకంగా స్పీకర్‌గా తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేసి కొన్ని కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్‌ని ఎత్తుకుపోయాడన్నది ఇంత బహిరంగంగా కనిపిస్తున్నా దాని గురించి ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటే...దీని అర్థం ఏంటి? ఆ దొంగతనానికి మీ ఆశీస్సులు ఉన్నాయనే కదా? మీ దొంగల ముఠా వ్యవహారాన్ని బయటపడకుండా విషయాన్ని పక్కదారి పట్టించే భాగంగా వరదలపై మీరు ప్రెస్‌మీట్‌ పెట్టారని అందరికీ అర్థం అవుతుంది.

చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో ప్రజలెందుకు తనని ఓడించారన్న ఆలోచన లేదు. 13 జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా తన ఓటమికి కారణాలేంటో అన్న సమీక్ష లేదు. ఐదేళ్లపాటు ప్రతి ఒక్క విషయంలోనూ అబద్ధాలు చెప్పి, పార్టీని నిలువునా ముంచానన్న బాధలేదు. కాబట్టి చంద్రబాబుగారిని ఒక్కటే అడగదలచుకున్నా.. ఇప్పటికైనా నిజాలు చెప్పడం ప్రారంభించండి. మీ శేష జీవితంలో మీరేదో కొద్దిగా మారానని చెప్పుకునే ప్రయత్నం చేయండి’ అని హితవు పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top