మోసపూరిత సర్కార్కు ఇక చరమగీతమే
రాష్ట్ర వ్యాప్తంగా ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమం
హామీలు అమలు చేయని చంద్రబాబును నమ్మంగాక నమ్మం అన్న ప్రజలు
సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపాటు
సాక్షి, నెట్వర్క్: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలు చోట్ల సభలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు మోసపూరితంగా వ్యవహరించిన చంద్రబాబు సర్కార్కు చరమగీతం పాడతామని ప్రతినబూనారు. వందలాది హామీలిచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయక తమను మోసగించిన చంద్రబాబును ఇక నమ్మంగాక నమ్మం అని నినదించారు. చంద్రబాబు సర్కార్ మోసాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రజలకు వివరించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే నవరత్నాలుతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడతారని, తిరిగి దివంగత మహానేత వైఎస్ పాలనను తీసుకువస్తారని చెప్పారు. విజయనగరం జిల్లాలో నిన్ను నమ్మం బాబూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాలూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పాల్గొనగా ఇతర ప్రాంతాల్లో స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి నేతృత్వంలో, పెదదోర్నాలలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. కనిగిరి, చీర్లదిన్నె, గిద్దలూరు నియోజకవర్గం, కొండపిలో కార్యక్రమం జరిగింది. కృష్ణా జిల్లాలో చల్లపల్లిలో, కైకలూరు నియోజకవర్గంలో, తిరువూరులో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా తడలో జరిగిన కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో, గుంటూరు జిల్లా కర్లపాలెంలో ఎమ్మెల్యే కోన రఘుపతి, నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబుతో పాటు పలువురు నేతలు వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కాకినాడలోని కరపలో ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీనేత కన్నబాబు
అనంతపురం నియోజకవర్గంలో అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో, మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం జరిగింది. పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. పెనుబాకలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిన్ను నమ్మం బాబూ కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నాయి. చంద్రబాబు వైఫల్యాలను, మోసాలను ప్రజలకు వైఎస్సార్సీపీ నేతలు వివరించారు.