రాష్ట్రంలో సరికొత్త కూటమి: తమ్మినేని
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో ముందుగానే రాజకీయ వాతావరణం వచ్చిందనీ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, దౌర్జన్యం, నియంతృత్వం, అక్రమ కేసులు పెట్టడం, పోడు భూములను లాక్కోవడం, బలవంతంగా భూసేకరణ చేయడమే పనిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ కూడా ప్రజలకు అన్యాయం చేసిందన్నారు.
అందుకే రాష్ట్రస్థాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు తాజాగా నిర్ణయించినట్లు తమ్మినేని పేర్కొన్నారు. ఆదివారం కొత్తగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఫ్రంట్లో అన్ని వామపక్షాలను, సామాజిక సంస్థలు, మేధావులు, కళాకారులను కలుపుకొని ముందుకు వెళతామని చెప్పారు. ఇందుకోసం ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, పవన్ కల్యాణ్ తదితరులతో చర్చలు జరుపుతామన్నారు.
అలాగే జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి, తర్వాత బస్సు యాత్రలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే మూడో రాజకీయ కూటమి ద్వారానే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, రానున్న సాధారణ ఎన్నికలను సైతం ఎదుర్కొంటామని తమ్మినేని స్పష్టం చేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి యావజ్జీవ కారాగార శిక్ష పడి ఏడేళ్లు పూర్తి చేసుకున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేయాలని కోరుతూ తమ్మినేని సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.