లోకేష్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా?
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు సరిగ్గా ఎన్నికల ముందు నానా హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి హోదా ఉద్యమాన్ని అడగడుగున అణచి వేసిన చంద్రబాబు.. ప్రతిపక్ష నేత పాదయాత్రతో ఉలిక్కిపడి హోదా జెండా ఎత్తుకున్నారు. ఎన్నికల ముందు కేంద్రంతో తెగతెంపులు చేసుకొని హోదా కోసం తానే పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఇక బాబు యూటర్న్తో ఆయన ఎల్లోమీడియా కూడా అదే బాటలో నడుస్తోంది. ఆయన సుపుత్రుడు నారా లోకేష్ అయితే ఏకంగా ప్రతిపక్షనేతను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. (చదవండి : మళ్లీ దొరికిపోయిన లోకేశ్! )
కేంద్రంతో అంటకాగిన రోజుల్లో లోకేశ్ టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కొనియాడుతూ మాట్లాడిన మాటలు.. తాజాగా మోజో టీవీతో మాట్లాడుతూ.. అదే కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తడాన్ని పోల్చుతూ.. ఇదేం పద్దతి లోకేశ్ అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ‘అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ఎందుకని.. ఎన్నికల జిమ్మిక్కే కదా!’ అని ప్రశ్నిస్తున్నారు. (అయ్యో.. లోకేష్ అది కూడా తెలియదా?)
ప్రత్యేక హోదా జీఎస్టీ వచ్చాక కుదరదని, అది వచ్చాక హోదా ఉన్న రాష్ట్రాల్లో కూడా తీసేశారని, కానీ హోదాలో ఉన్నవాటిని ప్యాకేజీ ద్వారా టీడీపీ తీసుకొచ్చిందని, 2019లో కూడా బీజేపీతోనే ఉంటామని నాడు లోకేశ్ టీవీ9 ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కానీ తాజాగా తన తండ్రి యూటర్న్తో తాను కూడా మాట మార్చారు. గత నాలుగున్నరేళ్లుగా హోదాపై పోరాడుతూ.. ఆ అంశాన్ని సజీవంగా ఉంచిన ప్రతిపక్షనేతపై ఇవ్వాళ లోకేశ్ అవాకులు చవాకులు పేల్చుతున్నారు. హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలతో రాజీనామా చేయించి మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ప్రతిపక్షనేతను.. విభజన అంశాలపై మాట్లాడరే? అని నేడు లోకేష్ ప్రశ్నిస్తుండటం చూసి జనాలు నవ్వుతున్నారు. లోకేష్ తన తండ్రిని మించిపోయాడని సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.