ఊహించని షాక్.. టికెట్ ఇచ్చినా పార్టీ మారారు
సాక్షి, ముంబై: కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్కు ఊహించని షాక్ తగిలింది. ఎన్సీపీ బీడ్ నియోజకవర్గ అభ్యర్థి నమితా ముండాడా బీజేపీలో చేరారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఆమె బీజేపీలో చేరడంతో ఎన్సీపీ నేతలు షాక్కి గురయ్యారు. బీజేపీ నుంచి టికెట్ హామీ రావడంలో స్థానిక ఎంపీ ప్రీతం ముండే, మంత్రి పంకజ్ ముండే సమక్షంలో సోమవారం ఆమె కాషాయ గూటికి చేరారు. కాగా గత ఎన్నికల్లో నమిత ఎన్సీపీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. కాగా ఎన్నికల ప్రకటన వెలువడకముందే ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల రాజీనామాలు చేసి శివసేన-బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కొంతమందికి టికెట్ హామీ రావడంతో ఉండిపోయారు. కానీ సీటు కేటాయించిన తరువాత కూడా పార్టీని వీడటంతో నేతలు, కార్యకర్తలు తీవ్ర విస్మయానికి గురవుతున్నారు.