ఒక్క రూపాయీ మాఫీ చేయలేదు
రైతు రుణాలపై కేంద్రాన్ని దుయ్యబట్టిన రాహుల్ గాంధీ
ధోల్పూర్: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాల్లో ఒక్క రూపాయిని కూడా మాఫీ చేయలేదనీ, భారత్లో తయారీ (మేక్ ఇన్ ఇండియా) కార్యక్రమం పూర్తిగా విఫలమైందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు. డిసెంబర్లో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్లో రాహుల్ 150 కిలో మీటర్ల దూరంపాటు సాగే రోడ్ షోను ధోల్పూర్ జిల్లాలోని మనియాలో మంగళవారం ప్రారంభించారు.
15–20 మంది పారిశ్రామిక వేత్తలు తీసుకున్న మూడున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలను కేంద్ర ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో మాఫీ చేసిందనీ, రైతులకు మాత్రం మొండిచేయి చూపిందని రాహుల్ అన్నారు. గతంలో తమ ప్రభుత్వం 70 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందనీ, దేశాన్ని విడగొట్టడం ద్వారా ఏ ఉపయోగం ఉండదని ఆరెస్సెస్, బీజేపీలకు తెలియజెప్పాలని ప్రజలను రాహుల్ కోరారు.