చంద్రబాబుకు ముద్రగడ మరో లేఖాస్త్రం
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం
కిర్లంపూడి (జగ్గంపేట): సీఎం చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలవుతోందని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆక్షేపించారు. ఆయన ఏదైనా ఆసుపత్రిలో చూపించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
వచ్చే ఏడాది మే నెలతో టీడీపీ ప్రభుత్వ కాలపరిమితి పూర్తి కానుండగా, రెండేళ్ల కాలపరిమితితో నామినేటెడ్ పదవులకు జీవోలు ఇప్పించడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు కార్యకర్తల మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసి పదవులు కట్టబెట్టే కార్యక్రమం చేస్తున్నందుకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల గురించి కాపులు ఎంత మొత్తుకున్నా బీజేపీతో కలసి ఉన్న సమయంలో బిల్లును కేంద్రానికి పంపించలేదని, ఆ పార్టీతో స్నేహం చెడిన తరువాత అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపారని ఆక్షేపించారు.