బీజేపీ నైతికంగా ఓడింది
కోల్కతా: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. గుజరాత్ ప్రజలు సమతూకంగా తీర్పునిచ్చారని ట్వీట్ చేశారు. బీజేపీ విజయం తాత్కాలికమని, చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా కాషాయం పార్టీ గెలిచిందని వ్యాఖ్యానించారు. అవినీతి, అన్యాయం, కులవివక్షకు వ్యతిరేకంగా గుజరాత్ ప్రజలు ఓటు వేశారని అన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో గుజరాత్ కీలకం కానుందని అభిప్రాయపడ్డారు.
కుల రాజకీయాలను ఓడించాం
తమ రాష్ట్ర ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కలుషితం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ కుల రాజకీయాలను ఓడించామని అన్నారు. బీజేపీపై నమ్మకంతో మెజార్టీ స్థానాల్లో తమను ఓటర్లు గెలిపించారని చెప్పారు.