ఓటర్గా కూడా... గ్రేటర్గా ఉందాం
గ్రేటర్ సిటీలో ఓటింగ్ నాడు గడప దాటని పౌరులు
ఎన్నికలేవైనా.. 42 నుంచి 58% మించని పోలింగ్
ఈసారి ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు
మీరు ఓటేయాల్సిన పోలింగ్ కేంద్రం ఎక్కడుంది?
అబ్బా.. ఓటెయ్యడానికి అంత దూరం ఏం వెళ్తాం? అని ఆలోచిస్తూ బద్ధకిస్తున్నారా?
అటువంటి సందేహాలొద్దు. ఒక్క క్లిక్తో ఓటరు జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోవచ్చు. అంతేకాదు, రూట్మ్యాప్ సాయంతో నేరుగా పోలింగ్ కేంద్రానికీ చేరుకోవచ్చు. ఇక, దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్ బూత్కు చేరుకునేందుకు ప్రత్యేక వాహనాలూ అందుబాటులో ఉన్నాయి. ఇన్ని ఏర్పాట్లు ఎందుకంటే.. నగరవాసి ఓటెయ్యాలంటే మీనమేషాలు లెక్కిస్తాడని పేరు. పోలింగ్ కేంద్రానికి ఎలా వెళ్లాలనేది ఒక సమస్య అయితే, అంత ప్రయాసపడి వెళ్లడం అవసరమా? అనే ఆలోచనతో వెనక్కి తగ్గడం వల్ల గతంలో జరిగిన పలు ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువ నమోదైన దాఖలాలున్నాయి.
గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల పరిధిలో 77 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఐటీ, బీపీఓ, కేపీఓ, మార్కెటింగ్ తదితర అసంఘటిత రంగాల ఉద్యోగులు, వేతనజీవులు పోలింగ్ జరిగే రోజును సెలవుదినంగా భావిస్తూ ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఇది ప్రమాదకర పరిణామమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఈసారి ఓటర్లలో చైతన్యం నింపి స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేందుకు జీహెచ్ఎంసీ పలు యాప్లను అందుబాటులోకి తెచ్చింది. చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
2014: ‘పోలింగ్..ఫాలింగ్’
- 2014 సార్వత్రిక ఎన్నికల్లో నగరంలోని 182 పోలింగ్ కేంద్రాల్లో 40 శాతం కంటే తక్కువగా పోలింగ్ నమోదైంది
- 18 పోలింగ్ కేంద్రాల్లో కేవలం 30 శాతం పోలింగ్ నమోదు కాగా, ఐదు కేంద్రాల్లో 20 శాతానికే పరిమితమైంది
- 48 పోలింగ్ కేంద్రాల్లో 75 శాతం, మరో 71 కేంద్రాల్లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది
- సికింద్రాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 56.95 శాతం, అత్యల్పంగా మలక్పేట నియోజకవర్గంలో 47.62% పోలింగ్ నమోదైంది
- యాకుత్పురా నియోజకవర్గంలోని 31 పోలింగ్ కేంద్రాల్లో, నాంపల్లిలోని 29 పోలింగ్ స్టేషన్లలో, మలక్పేట్లోని 20 స్టేషన్లలో, కార్వాన్లోని 17 పోలింగ్ కేంద్రాల్లో 40 శాతానికే పోలింగ్ పరిమితం కాగా, కార్వాన్లోనే మరో 13 కేంద్రాల్లో 75% మించి పోలింగ్ నమోదైంది.
- చార్మినార్ నియోజకవర్గం పరిధిలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో 75 శాతం మించి పోలింగ్ జరిగింది.
‘గ్రేటర్’ యంత్రాంగం ఏం చేస్తోందంటే...
నో యువర్ ఓట్: నగరంలో పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల వివరాలను నగరవాసులకు తెలిపేందుకు ఇటీవల అన్ని పోలింగ్ బూత్ల వద్ద బల్దియా సిబ్బంది ఓటరు జాబితాలతో సహా తరలివచ్చి అవగాహన కలిగించారు. ఓటర్లకున్న అనుమానాలను తొలగించారు.
వాదా యాప్: అంధులు, వృద్ధులు, గర్భిణిలు రద్దీగా ఉండే పోలింగ్ కేంద్రాలకు వీలైన సమయంలో వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా అనువైన స్లాట్ను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వీరి కోసం ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంటాయి.
నమూనా పోలింగ్ కేంద్రాలు: జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల పరిధిలో నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి..కొత్తగా నమోదైన ఓటర్లు ఓటెలా వినియోగించుకోవాలో, వీవీప్యాట్ యంత్రాలెలా పని చేస్తాయో వివరిస్తున్నారు.
సీ విజిల్ (సిటిజన్ విజిల్): ఎన్నికల్లో అక్రమాలు, వివిధ పార్టీల అభ్యర్థులు, క్యాడర్ చేసే అక్రమాలను ఎన్నికల సంఘం, బల్దియా దృష్టికి తెచ్చేందుకు ఈ యాప్ అందుబాటులో ఉంది.
సువిధ: అభ్యర్థుల నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమాచారాన్ని ఈ యాప్ చెబుతుంది.
సమావేశాలు: ‘ఓటు’పై కాలనీ సంఘాలు, సెల్ఫ్హెల్ప్ గ్రూపులతో భేటీలు.
వాట్సాప్ నంబరు: ఓటింగ్పై వినూత్న క్యాప్షన్లను పంపించే సిటిజనులకు బహుమతులిచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా 7993153333 నంబరుతో వాట్సాప్ను అందుబాటులోకి తెచ్చింది.
ఓ.. టీ కొట్టండి!
నాగర్కర్నూలు బీజేపీ అభ్యర్థి దిలీప్చారి ఎన్నికల ప్రచారం..
విజయం.. విషాదం
విజయం ఆనందాన్నే కాదు.. ఒక్కోసారి విషాదాన్నీ మిగిలిస్తుందనేందుకు ఇదో ఉదాహరణ. 1983లో హైదరాబాద్లోని హిమాయత్నగర్ శాసనసభ స్థానం నుంచి గోపగాని నారాయణ గౌడ్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. ఎన్నికల అధికారులు ఆయన గెలుపొందినట్టు ప్రకటించారు. ఇది ఊహించని విజయం కావడంతో ఆయన.. తన అనుచరులతో కలిసి రోజంతా ఆనందాన్ని పంచుకున్నారు. అదేరోజు రాత్రి హఠాన్మరణం పాలయ్యారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పి.ఉపేంద్ర (టీడీపీ), ఆలె నరేంద్ర (బీజేపీ) తలపడగా.. నరేంద్ర విజయం సాధించారు.
14 ఎన్నికలు.. నలుగురే ఎమ్మెల్యేలు
మరిపెడ: అవును.. మీరు చదివింది నిజమే. ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన మొత్తం ఎన్నికల్లో నలుగురే ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 1957, 1962, 1967, 1972లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి నాలుగుసార్లు రాంచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1974, 1978, 1983, 1985లలో జరిగిన ఎన్నికల్లో రామసహాయం సురేందర్రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో డీఎస్ రెడ్యానాయక్ వరుసగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన సత్యవతి రాథోడ్ ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున డీఎస్.రెడ్యానాయక్ మళ్లీ గెలుపొందారు. మారిన రాజకీయ సమీకరణల్లో ఆయన టీఆర్ఎస్లోకి చేరారు. మొత్తానికి ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు నలుగురే ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించడం విశేషం.
తెలంగాణ @30
ఒకవేళ తెలంగాణను ఓ దేశంగా భావిస్తే.. ఓటర్ల సంఖ్య ప్రకారం మొత్తం ప్రపంచ దేశాల జాబితాలో 30వ స్థానంలోనిలుస్తుంది. తెలంగాణలో ఓటర్లు 2.61 కోట్ల మంది ఉండగా.. అంతకన్నా తక్కువ ఓటర్లున్న దేశాలు మరెన్నో ఉన్నాయి