నా అరెస్టు వార్తలు కట్టుకథలు: రోజా
కువైట్లో వైఎస్సార్సీపీ సభ సక్సెస్ చూసి ఓర్వలేకే దుష్ప్రచారం
సాక్షి, అమరావతి : కువైట్ పర్యటనలో ఉన్న తనను అక్కడి పోలీసులు అరెస్టుచేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని, అవి ఒట్టి కట్టుకథలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా అన్నారు. తనను అరెస్టు చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వర్గం చేస్తున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అరెస్టుపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆదివారం కువైట్ నుంచి రోజా మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నవరత్నాల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాను కువైట్లో జరిగే సభకు వెళ్లానని వీడియోలో రోజా తెలిపారు.
ఆ సభకు 400 మంది ప్రవాస భారతీయలు వస్తారనేది అంచనా కాగా.. అనూహ్యంగా రెండు వేల మందికి పైగా హాజరయ్యారని చెప్పారు. సభలు జరిగినప్పుడు పోలీసులు సభాస్థలికి వచ్చి పరిశీలించడం సాధారణ విషయమేనన్నారు. కువైట్ సభకు అనూహ్యమైన స్పందన రావడంతో టీడీపీ వారికి కన్నుకట్టి.. తప్పుడు ప్రచారం చేపట్టారని ఆమె అన్నారు.