‘సోమిరెడ్డి వస్తే జనాలు తొక్కి నలిపేసేవారు’
టీడీపీ నేత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా మండిపాటు
సాక్షి, తిరుమల : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఇచ్ఛాపురంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కానీ, అక్కడ జనమే లేరని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి అంటున్నారు. ఆయన గనుక నిన్నటి సభకు వచ్చి ఉంటే జనాలు తొక్కి నలిపేసేవారని రోజా వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, చంద్రబాబు పాలనను ఎండగట్టడానికి మరో ప్రస్థానంలా ప్రజా సంకల్ప పాదయాత్ర సాగిందని అన్నారు.
గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ నేడు స్వామివారి దర్శనం కోసం తిరుమల వస్తున్నారని తెలిపారు. మరోవైపు తిరుపతికి వస్తున్న జననేతకు ఘన స్వాగతం పలికేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజన్న వారసుడికి ఆత్మీయ స్వాగతం కోసం ఎదురు చూస్తున్నారు.