చంద్రబాబు మోసకారి
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్
నెల్లూరు(సెంట్రల్): ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారిని మోసం చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ విమర్శించారు. మంగళవారం నగరంలోని 52వ డివిజన్ రంగనాయకులపేటలో మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు పఠాన్ ఫయాజ్ఖాన్ ఆధ్వర్యంలో ప్రజాదీవెన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన దళితతేజం పేరుతో కార్యక్రమాన్ని నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారన్నారు. గతంలో ఎవరైనా ఎస్సీలో పుట్టాలని కోరుకుంటా రా అని వ్యాఖ్యానించారని, దీనిని బట్టి దళితులపై బాబుకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. చులకనగా మాట్లాడిన చంద్రబాబు దళితతేజం కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి దళితులకు మేలు చేస్తున్నానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
దళితులు, బీసీలు, మైనార్టీ లంటే చంద్రబాబు నిర్లక్ష్యంగా చూస్తారన్నారు. మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, దీంతో ఆయనకు వారిపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు. నాయీ బ్రాహ్మణులు సమస్యలు చెప్పుకుందామని వెళితే ఏ విధంగా బెదరించారో ప్రజలు చూశారన్నారు. ఒకవైపు దళితుల ఇళ్లను కూలుస్తూ మరోవైపు దళితతేజం ఏర్పాటు చేయడం దారుణమన్నారు. పెన్నానది ప్రాంతంలో కట్టిన ఇళ్లను కట్టబెట్టేందుకు మంత్రి నారాయణ ప్రయత్నిస్తున్నారని, దీంతో పేదలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. పేదలకు స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరతామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం.కమల్, ఎండీ షాబుద్దీన్, మధు, ఆర్.ఉదయ్, లక్ష్మణ్, ఎస్కే మూసా, ఇస్మాయిల్, కరిముల్లా, హుస్సేన్, అల్లాభక్షు, చందవోలు సతీష్, రమేష్, నయూం, ముజికీర్, వినోద్, దార్ల వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ ఇంతియాజ్ పాల్గొన్నారు.