రాష్ట్ర సర్కార్పై భట్టి విక్రమార్క మండిపాటు
సాక్షి, బోనకల్ : తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్టుల నిర్మాణంపై చిత్తశుద్ధి లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నియామకాల గురించి సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధిర నియోజకవర్గం బోనకల్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. నిరుద్యోగులను, రైతులను సర్కార్ మోసం చేస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే తెలంగాణలో లక్షన్నర ఖాళీలు ఉన్నాయి. కానీ కొత్త ఉద్యోగాల కల్పన ఎందుకు జరగలేదని, ప్రభుత్వం ప్రకటించిన ఆఖరి బడ్జెట్ లోనూ ఉద్యోగాల గురించి ఎటువంటి ప్రకటన లేదంటూ భట్టి ప్రశ్నించారు.
మద్దతు ధర లేక రైతులు ఎకరానికి 25 వేల రూపాయల నుంచి రూ. లక్షన్నర వరకూ నష్టపోతున్నారన్నారు. ఇక ప్రధానంగా పసుపు రైతు ఎకరానికి రూ. 75 వేలు ఆదాయం కోల్పోతున్నారని చెప్పారు. రైతులును ఆదుకోవడం అంటే.. వారికి మదద్దతు ధర ఇవ్వడమే కానీ.. బిచ్చమేసినట్లు రూ. 4 వేలు ఇవ్వడం కాదన్నారు. ఆయా పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కొత్త ప్రాజెక్టులు లేవు
టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టలేదని, అలాగే ఒక్క ఎకరాకు అదనంగా సాగు నీరు ఇవ్వలేదన్నారు. కానీ ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల నిధులను మాత్రం ప్రాజెక్టుల
పేరుతో స్వాహ చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్, సీతారామ కార్పొరేషన్, మిషన్ భగీరథ కార్పొరేషన్ల ఏర్పాటుపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న వేలకోట్ల అప్పుల వల్ల
తెలంగాణ ప్రమాదంలో పడుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో చేయని అప్పులను కేసీఆర్ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలో చేసిందని భట్టి ఆరోపించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో
సాగనంపాల్సిందేనని భట్టి ప్రజలకు పిలుపునిచ్చారు.