సమాధానం చెప్పాలి: మల్లాది విష్ణు
రేవంత్రెడ్డి బయటపెట్టిన విషయాలపై టీడీపీ స్పందించాలి
పోలవరం, చంద్రబాబు విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
వైఎస్సార్ సీపీ నేత మల్లాది విష్ణు డిమాండ్
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం నాటకాలాడుతోందని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్టర్ పనులు చేయడం లేదని అబద్ధాలు చెబుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టును టీడీపీ కాసుల వరంగా మార్చేసిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలన్న లక్ష్యంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు సర్కారు ఆ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ధనార్జనే ధ్యేయంగా కమీషన్లు మూట కట్టుకుంటోందని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి లేని చంద్రబాబు విదేశీ పర్యటనలతో రాష్ట్ర సంపదను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం అక్రమాలపై వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరాన్ని చేజిక్కించుకొని చంద్రబాబు ఏం సాధించారని సూటిగా ప్రశ్నించారు. 2019 కల్లా పోలవరం పూర్తి చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పే ధైర్యం టీడీపీకి ఉందా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు.
పోలవరం ప్రాజెక్టులో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కాంట్రాక్టు దక్కించుకుంది వాస్తవమా, కాదా అని ప్రభుత్వాన్ని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్ యాదవ్ కాంట్రాక్టు దక్కించుకుంది నిజంకాదా అని అడిగారు. పోలవరం, అమరావతి, విదేశీ పర్యటనలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి బయటపెట్టిన విషయాలపై టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.