సవాల్: లోకేష్ మీ ఆస్తులివ్వండి.. రెట్టింపు ఇస్తాం!
లోకేష్ ఆస్తుల ప్రకటన బూటకం, నాటకం
700 కోట్లతో 22 మంది ఎమ్మెల్యేలను కొన్నారు
లోకేష్ ఆ డబ్బును ఆస్తిలో ఎందుకు చూపలేదు?
ఏపీలో డిసెంబర్ 8ని అబద్ధాల దినోత్సవంగా జరుపుకోవాలి
వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్తుల ప్రకటన బూటకం, నాటకమని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. లోకేష్ చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి గానీ, అర్హత గానీ నారా లోకేష్కు లేదన్నారు. న్యాయపరమైన అంశాలపై ఆస్తుల ప్రకటన చేయాలని వైఎస్ జగన్ను కోరడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శమన్నారు. లోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన లెక్కలు నిజమైతే, ఆ ఆస్తులను మాకివ్వండి.. మీకు రెట్టింపు డబ్బులిస్తాం. మీకు దమ్ముంటే మా సవాల్ను స్వీకరించాలంటూ మల్లాది విష్ణు సవాల్ విసిరారు. లోకేష్ ఆస్తుల ప్రకటన చేసిన డిసెంబర్ 8ని అబద్ధాల దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
వైఎస్ఆర్ సీపికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను దాదాపు రూ.700 కోట్లు పైగా ఖర్చు చేసి టీడీపీ కొనుగోలు చేసిందని, అది మీ పెట్టుబడి డబ్బులు కాదా.. మీ ఆస్తుల ప్రకటనలో ఈ డబ్బును ఎందుకు చూపించలేదని లోకేష్ను ఈ సందర్భంగా మల్లాది విష్ణు ప్రశ్నించారు. మంత్రి లోకేష్ ఆస్తుల ప్రకటన అవాస్తవమని, అంతా బూటకం, నాటమని విమర్శించారు. హైదరాబాద్లో ఉన్న ఇంటిని మీడియాకు దూరంగా పెట్టారని, తమకు ఏమీ లేనట్లుగా చంద్రబాబు నటిస్తూ, కొడుకుతో కూడా తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి, అర్హత లోకేష్కు లేదన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మేం రూపొందించిన 'అవినీతి చక్రవర్తి చంద్రబాబు' అనే పుస్తకంపై విచారణ చేయించుకుని చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.