బీజేపీని రాముడే శిక్షిస్తాడు!
సాక్షి, పట్నా: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఎన్నికల వచ్చిన ప్రతిసారి బీజేపీ శ్రీరాముడి పేరును వాడుకుంటోందని విమర్శించిన ఆయన.. ఈ దఫా తన పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఆయనే శిక్షిస్తాడని అన్నారు. రాజకీయాల కోసంభగవంతుడైన శ్రీరాముడి పేరును వాడుకోవడం అత్యంత దారుణమని ఆయన విమర్శించారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శ్రీరాముడి పేరుతో రాజకీయ నాటకాన్ని రక్తికట్టిస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. దేశంలో ప్రతి వ్యక్తికి తమ మతాన్ని, మతాచారాలను పాటించే హక్కు ఉందని చెప్పిన ఆయన.. అందుకోసం డ్రామాలు అడాల్సిన అవసరం లేదని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ సరయూ నది ఒడ్డున పొలిటికల్ డ్రామా చేశారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడుతున్న ఈ డ్రామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతారని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు.