సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
543 లోక్సభ, నాలుగు రాష్ట్రాలా అసెంబ్లీలకు ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.
చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. షెడ్యూలు ప్రకటించిన
మరుక్షణం నుంచి దేశవాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ 543 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
- మార్చి18న మొదటి నోటిఫికేషన్ విడుదల
- ఏప్రిల్ 11న తొలి విడత లోక్ సభ ఎన్నికలు
- ఏప్రిల్ 18న రెండోదశ లోక్ సభ ఎన్నికలు
- ఏప్రిల్ 23న మూడో దశ లోక్ సభ ఎన్నికలు
- ఏప్రిల్ 29న నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు
- మే 6న ఐదో దశ లోక్ సభ ఎన్నికలు
- మే 12న ఆరోదశ లోక్ సభ ఎన్నికలు
- మే 19న ఏడో దశ లోక్ సభ ఎన్నికలు
- మే 23న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు