ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ హవా

Local Parties Majority in First Stage Elections - Sakshi

తొలిదశ పోలింగ్‌లో ప్రాంతీయ పార్టీలదే హవా

తెలంగాణలో పరిస్థితులన్నీ టీఆర్‌ఎస్‌కు అనుకూలం

యూపీలో బలం పెంచుకోనున్న ఎస్పీ–బీఎస్పీ–ఆర్‌ఎల్‌డీ

మహారాష్ట్ర విదర్భలో పాలకపక్షానికి ఎదురుగాలి

ప్రచారాలకు తెరపడింది. ఓటరు.. తీరికగా ఆలోచించుకుని ఓటేసేందుకు సిద్ధమవుతున్నాడు! ఇంకో రోజులో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో తొలిదశ పోలింగ్‌ ప్రారంభం కానుంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 91 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా జరుగుతున్న ఈ పోలింగ్‌లో ప్రాంతీయ పార్టీలకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఎన్నికల్లో నేరగాళ్లను తగ్గిస్తామని, అభివృద్ధి అందరికీ అందేలా చేస్తామని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చాయి. వాస్తవ పరిస్థితులేమిటన్నది ఇటీవల ప్రచురితమైన అడ్మినిస్ట్రేటివ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ నివేదిక ప్రకారం తొలిదశ బరిలో ఉన్న 1,206 మంది అభ్యర్థుల్లో క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న, విచారణ ఎదుర్కొంటున్న వారు ఈ రెండు పార్టీల్లోనే 30 నుంచి 40 శాతం వరకూ ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ 91 స్థానాల ఫలితాలను ఒక్కసారి విశ్లేషిస్తే.. ఎన్డీయే దాదాపు 50 స్థానాలు గెలుచుకోగా యూపీఏకు ఐదు దక్కాయి. మిగిలిన సీట్లన్నీ ప్రాంతీయ పార్టీలైన టీఆర్‌ఎస్‌ (11), వైఎస్సార్‌సీపీ (8), బీజేడీ (4), టీఎంసీ (2) గెలుచుకున్నాయి. ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందారు. ఈ ఫలితాల ప్రాతిపదికన తాజా ఎన్నికలను పరిశీలిస్తే..

ఛత్తీస్‌గఢ్‌:  ‘బస్తర్‌’ మే సవాల్‌
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ మద్దతుదార్లు ఎక్కువగా ఉండగా... పట్టణ, నగర ప్రాంతాల్లో బీజేపీ మంచి పట్టే సాధించింది. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బస్తర్‌లో 1998 నుంచి బీజేపీ గెలుస్తోంది. ఈసారి బీజేపీ తరఫున బైదూ రామ్‌ కశ్యప్‌ పోటీ చేస్తుండగా.. గిరిజనుల మొగ్గు కాంగ్రెస్‌ వైపు ఉండే అవకాశముంది.

బిహార్‌: బరాబర్‌
బిహార్‌లో గయ, నవాడా, జముయితో పాటు ఔరంగాబాద్‌లో తొలిదశ పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాలు, ఎన్డీయే భాగస్వామి లోక్‌ జనశక్తి ఒక స్థానం గెలుచుకున్నాయి. తాజా ఎన్నికల్లో లోక్‌ జనశక్తి నుంచి చిరాగ్‌కుమార్‌ పాశ్వాన్‌ జముయి నుంచి పోటీ చేస్తున్నారు. గయలో విజయ్‌ కుమార్‌ (జేడీయూ), జితన్‌ రామ మాంఝీ (హెచ్‌ఏఎం) మధ్య పోటీ ఉంది.

మహారాష్ట్ర:  రైతు చేతిలో ఫలితం
మొత్తం 48 స్థానాలకు ఏడింటిలో తొలిదశ పోలింగ్‌ జరగనుంది. విదర్భ ప్రాంతంలో ఉండే ఈ వార్ధా, రామ్‌టేక్‌ (ఎస్సీ), నాగ్‌పూర్, భండారా–గోండియా, గడ్చిరోలి –చిమూర్‌ (ఎస్టీ), చంద్రపూర్, యావత్మల్‌ –వాషిమ్‌ స్థానాలను గత ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి గెలుచుకుంది. గత ఐదేళ్లలో వ్యవసాయ సంక్షోభం మరింత ముదరడం, లక్షల మంది రైతులు రాజధాని ముంబైకి భారీ నిరసన ప్రదర్శన చేపట్టడం అధికార కూటమికి కొంత ఇబ్బంది కలిగించే అంశాలుగా మారాయి. వరస కరువులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించినా, లోలోపల వారి ఆగ్రహం ఏమాత్రం చల్లారడం లేదు.
తొలిదశ ఎన్నికల్లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి పోటీ చేస్తున్న నాగ్‌పూర్‌ లోక్‌సభ స్థానం కీలకంగా మారనుంది. గత ఎన్నికల్లో భండారా–గోండియా నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచిన నానా పటోలే ఈసారి కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్నారు.
యావత్మల్‌–వాషిమ్‌ శివసేనకు బాగా పట్టున్న నియోజకవర్గం కాగా.. సిట్టింగ్‌ ఎంపీ భావనా గావ్లీ, కాంగ్రెస్‌ అభ్యర్థి మాణిక్‌ రావు థాక్రేల మధ్య గట్టి పోటీ ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, శివసేనలోని అంతర్గత తగాదాలు భావనా గావ్లీ అవకాశాలను దెబ్బతీయనున్నాయి. గత ఎన్నికల్లోనూ అతితక్కువ మార్జిన్‌తో గట్టెక్కిన గావ్లీ వరుసగా నాలుగుసార్లు ఈ స్థానం నుంచి గెలుపొందడం విశేషం.
మొత్తమ్మీద చూస్తే విదర్భ ప్రాంతంలోని మొత్తం ఏడు స్థానాల్లో ఈసారి ఒకట్రెండు స్థానాలు కాంగ్రెస్‌ –ఎన్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది.

అసోం:  బీజేపీకే మొగ్గు!
తేజ్‌పూర్, కాలిబోర్, జోర్హాట్, దిబ్రూగఢ్, లఖిమ్‌పూర్‌లో తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో కాలిబోర్‌ స్థానాన్ని కాంగ్రెస్‌.. మిగిలిన నాలుగింటినీ బీజేపీ గెలుచుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన నేపథ్యంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. అసోం గణ పరిషత్, బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌తో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడం దీనికి ఒక కారణమవుతుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ మూడుసార్లు గెలిచిన కాలిబోర్‌లో ఈసారి అసక్తికరమైన పోటీ నెలకొని ఉంది. సిట్టింగ్‌ ఎంపీ గౌరవ్‌ గగోయ్‌ను ఎదుర్కొనేందుకు ఏజీపీ, బీజేపీల కూటమి మధబ్‌ మహంతను నిలిపాయి.

తెలంగాణ:  కారు.. పదహారు
తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు పోటీ జరుగుతుండగా, పరిస్థితులన్నీ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)కి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావుకు పేరుండటం ఇందుకు ఒక కారణం. గత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు 11 స్థానాలు దక్కగా.. ఆ తరువాత టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీలు ముగ్గురు అధికార పక్షంవైపు మళ్లడంతో ఆ పార్టీ బలం 14కు పెరిగింది. తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 16 స్థానాల్లోనూ, ఒక స్థానంలో ఆలిండియా మజ్లిస్‌ ఇత్తేహదుల్‌ ముస్లమీన్‌ తరఫున అసదుద్దీన్‌ ఒవైసీ పోటీ చేస్తున్నారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా ఒక అవగాహన మేరకు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 13 శాతం వరకూ మున్న ముస్లింల ఓట్లు టీఆర్‌ఎస్‌ వైపు మళ్లేందుకు అవకాశాలు పెరుగుతాయి. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, రైతుబంధు తదితర పథకాల దన్నుతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్‌ విశ్వసిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అత్యధిక స్థానాలు లభించే అవకాశం ఉంది.

ఉత్తరాఖండ్‌:  బీజేపీ దౌడ్‌
తొలిదశలో 5 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో
ఈ స్థానాలు (తేహ్రీ, గర్వాల్, అల్మోరా (ఎస్సీ), నైనిటాల్‌ –ఉద్ధమ్‌సింగ్‌ నగర్, హరిద్వార్‌)ను బీజేపీ గెలుచుకుంది. ఈసారి కూడా వీటన్నింటినీ తామే గెలుచుకుంటామని బీజేపీ నమ్మకంగా ఉంది. గర్వాల్‌లో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ తీరథ్‌ సింగ్‌ రావత్‌ను మాజీ కేంద్రమంత్రి, సీనియర్‌ బీజేపీ నేత బి.సి.ఖండూరి కుమారుడు మనీశ్‌ ఖండూరి కాంగ్రెస్‌టికెట్‌పై ఎదుర్కొంటుండటం ఆసక్తికరంగా మారింది.రాష్ట్రం మొత్తమ్మీద బీజేపీకి నాలుగు స్థానాలు దక్కే అవకాశాలుకనిపిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌:  కూటమిదే హవా
కైరానా, ముజఫర్‌నగర్, భాగ్‌పట్, ఘజియాబాద్, మీరట్, సహారన్‌పూర్, బిజ్నోర్, గౌతమ్‌బుద్ధనగర్‌.. ఈ ఎనిమిది స్థానాల్లో పోలింగ్‌ జరగనున్న యూపీలో పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. ఎస్పీ–బీఎస్సీ–ఆర్‌ఎల్‌డీ కూటమి ఒకవైపు, కాంగ్రెస్, బీజేపీ చెరోవైపు పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీలకు దాదాపు 42.7 శాతం ఓట్లు దక్కగా.. ఈసారి తమ కూటమికి యాదవ, జాటవ్, జాట్‌ల మద్దతు ఉందని అంచనా వేస్తోంది. వీటికి ముస్లింల ఓట్లు కలిస్తే రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
భాగ్‌పట్‌లో బీజేపీ నేత, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సత్యపాల్‌ సింగ్‌కు– ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు అజిత్‌ సింగ్, చౌదరీ చరణ్‌సింగ్‌ల రాజకీయ వారసుడు జయంత్‌ చౌదరికి మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. నియోజకవర్గంలోని దాదాపు 20–40 శాతం ముస్లింలు, 10–20 శాతం దళితులు ఉండగా.. ఈ సామాజిక వర్గాల ఓటర్లను ఎవరు సమర్థంగా తమవైపు తిప్పుకోగలరన్నది ఆసక్తికరంగా మారింది.
కైరానాలో ప్రదీప్‌ చౌదరి (బీజేపీ), కూటమి అభ్యర్థి తబస్సుమ్‌ హసన్, కాంగ్రెస్‌ అభ్యర్థి హరీందర్‌ మాలిక్‌ మధ్య ముక్కోణపు పోటీ ఉండగా.. సీనియర్‌ నేత హుకుమ్‌ సింగ్‌ కుమార్తె మ్రిగాంకా సింగ్‌కు టికెట్‌ నిరాకరించడం బీజేపీ కార్యకర్తల్లో చీలికలకు కారణమైంది. ఫలితంగా కూటమి అభ్యర్థి లాభపడే అవకాశాలు ఉన్నాయి.
ముజఫర్‌ నగర్‌లో ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు అజిత్‌సింగ్, ముజఫర్‌నగర్‌ అల్లర్ల నిందితుడు, సిట్టింగ్‌ ఎంపీ సంజీవ్‌ బల్యాన్‌ మధ్య తీవ్రపోటీ నెలకొంది. 2013 నాటి మత ఘర్షణలు సమసిపోయినట్టుగా కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఓటర్లు రెండు వర్గాలుగా విడిపోయినట్లు స్పష్టమవుతోంది. ఈ నియోజకవర్గంలో దళితులు దాదాపు 10–20 శాతం, ముస్లింలు 20–40 శాతం మంది ఉన్నారు. జాట్, దళిత, ముస్లిం వర్గాల ఓటర్లను ఆకట్టుకోగలిగితే అజిత్‌సింగ్‌ గెలుపుసులువవుతుంది.
గౌతమబుద్ధనగర్, ఘజియాబాద్‌ స్థానాలను మళ్లీ నిలబెట్టుకోగలమని బీజేపీ విశ్వాసంతో ఉంది. ముస్లింలు కూటమికి ఓటేయాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పిలుపునివ్వడాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని హిందూ ఓట్లను మళ్లించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా ఇందులో కొంతవరకు విజయం సాధించే అవకాశాలూ లేకపోలేదు.

జమ్మూకశ్మీర్‌:  పోటీ తీవ్రం
జమ్మూ కశ్మీర్‌ విషయానికొస్తే.. తొలిదశలో బారాముల్లా, జమ్మూలలో పోలింగ్‌ జరగనుంది. జమ్మూలో జుగల్‌ కిశోర్‌ శర్మ (బీజేపీ), రమణ్‌ భల్లా (కాంగ్రెస్‌) మధ్య పోటీ తీవ్రంగా ఉంది. బారాముల్లాలో మాత్రం బీజేపీతోపాటు నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్‌తో చతుర్ముఖ పోటీ ఉంది.
ఈశాన్యం:  ఎవరికి అనుకూలం?
ఈశాన్య ప్రాంతంలోని అనేక రాష్ట్రాల్లో తొలిదశ ఎన్నికలు గురువారం జరగనున్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండగా, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో పరిస్థితులు బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి.
మణిపూర్‌లో పౌరసత్వ బిల్లు ఓటర్లను ప్రభావితం చేయనుండగా.. మిజోరామ్, నాగలాండ్‌లోనూ పరిస్థితి అలాగే ఉంది.
మేఘాలయలోని షిల్లాంగ్‌ నుంచి మూడోసారి ఎన్నికయ్యేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విన్సెంట్‌ పాలా పోటీ పడుతుండగా తురాలో అధికార ఎన్‌పీపీ అభ్యర్థిగా అగాథా సంగ్మా బరిలో ఉన్నారు.
సిక్కింలో సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్, సిక్కిం నేషనల్‌ కాంగ్రెస్‌తోపాటు జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియా పార్టీ హమ్రో సిక్కిం పార్టీ మధ్య ముక్కోణపు పోటీ ఉంది.
తనకు గట్టి పట్టున్న త్రిపుర పశ్చిమ ప్రాంతం నుంచి సీపీఎం.. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అండమాన్‌ నికోబార్‌లో బీజేపీకి చెందిన కుల్దీప్‌రాయ్‌ శర్మ కాంగ్రెస్‌ తరఫున, విశాల్‌ జాలీ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
లక్షద్వీప్‌లో ఎన్సీపీ–కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉంది.

 ఒడిశా:  వేసేనా బీజేపీ పాగా
ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ 2014 ఎన్నికల్లో మొత్తం 21 స్థానాల్లో 20 గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కలహండి, నబరంగ్‌పూర్‌ (ఎస్టీ), బెర్హంపూర్, కోరాపుట్‌ స్థానాలకు తొలిదశలోనే ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు స్థానాల్లోనూ సిట్టింగ్‌ ఎంపీలను మార్చిన అధికార పార్టీ కొత్తవారికి అవకాశమిచ్చింది. ఇందులో కోరాపుట్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ భార్యకు టికెట్‌ దక్కగా, కలహండిలో ధరమ్‌గఢ్‌ ఎమ్మెల్యే పుష్పేంద్రసింగ్‌ దేవ్‌ పోటీ చేస్తున్నారు. తొలిసారి గెలుపు అందుకోవాలని ఆశిస్తున్న బీజేపీ ఈ నాలుగింటిలో ఒకట్రెండు స్థానాలు గెలుచుకోవచ్చునని అంచనా.

పశ్చిమ బెంగాల్‌:  నువ్వా?నేనా?
పశ్చిమ బెంగాల్‌లో తొలిదశ పోలింగ్‌ కూచ్‌బేహార్, అలిపురదౌర్‌ స్థానాలకు జరగనుంది. 2014లో ఈ స్థానాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలుచుకోగా, ఈ ప్రాంతంలోని తేయాకు కార్మికుల్లో అధికార పార్టీపై అసంతృప్తి పెరిగిపోతుండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. అతి తక్కువ వేతనాలు, భూమిహక్కులు లేకపోవడం వంటివి బీజేపీకి అనుకూలంగా మారే అవకాశముంది. అలిపురదౌర్‌లో సిట్టింగ్‌ టీఎంసీ ఎంపీ దశరథ్‌ తిర్కీ, మిలి ఒరాన్‌ (ఆర్‌ఎస్‌పీ), జాన్‌ బర్లా (బీజేపీ)తోపాటు మోహన్‌లాల్‌ బసుమతా (కాంగ్రెస్‌) బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో తిర్కీ అతి తక్కువ ఓట్లతో గెలుపొందారు.

ఆంధ్రప్రదేశ్‌: ‘ఫ్యాన్‌’ గాలి వీస్తోంది
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బరిలో ఉండటం ద్వారా బహుముఖ పోటీ ఉన్నట్లు కనిపిస్తున్నా.. వాస్తవానికి పోటీ వైఎస్సార్‌సీపీ– టీడీపీ మధ్య మాత్రమే. సీఎస్‌డీఎస్‌–లోక్‌నీతి–ద హిందూ నిర్వహించిన సర్వేలోనూ వైఎస్సార్‌సీపీకి 46 శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 36 శాతం వస్తాయని తేల్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో మద్దతిస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటించడం వ్యూహాత్మకంగా ఆ పార్టీకి మేలు చేసేదే. హోదా రాకపోయేందుకు కేంద్రం కారణమన్న తెలుగుదేశం విమర్శలకు ప్రధాని మోదీ గట్టి సమాధానం ఇవ్వడం, కేంద్రం తగినన్ని నిధులిచ్చినా ఎన్డీయే నుంచి బయటకు వెళ్లి టీడీపీ విమర్శలు చేయడం ఏం సబబని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు, నేతల అవినీతి, రాజధాని నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలు, పోలవరం నిర్మాణం పూర్తికాకపోవడం, విభజన హామీల అమల్లో వైఫల్యాలను వైఎస్సార్‌సీపీ తన ముఖ్య ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. తాజా ఎన్నికల్లో వైస్సార్‌సీపీ రాయలసీమ ప్రాంతంలో తన బలాన్ని మరింత పెంచుకునే అవకాశాలున్నాయి.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. కోస్తా ప్రాంతంలోని అరకు (ఎస్టీ)తోపాటు ఒంగోలు, నెల్లూరు స్థానాలను నిలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీడీపీ నుంచి ఇటీవలే వైఎస్సార్‌సీపీలో చేరిన పండుల రవీంద్రబాబు.. అమలాపురంలో పార్టీకి బలం కానున్నారు. అలాగే, కాండ్రేగుల సత్యవతి అనకాపల్లి నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. తద్వారా టీడీపీకి రెండు స్థానాలు తగ్గనున్నాయన్నమాట.
రాయలసీమలో వైఎస్సార్‌సీపీ ఈసారి గత ఎన్నికల కంటే మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోనుంది.
బాపట్లలో టీడీపీ ఎంపీ మల్యాద్రి శ్రీరామ్‌కు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నందిగమ్‌ సురేశ్‌ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.
గుంటూరులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎం.వేణుగోపాలరెడ్డి మధ్య పోటీ నెలకొంది.
కాకినాడ, రాజమండ్రి, నరసరావుపేటల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన మధ్య ముక్కోణపు పోటీ ఉంది. ఈ మూడు స్థానాల్లో కాపు ఓటర్లు కొంత వరకు జనసేనవైపు మళ్లడం ద్వారా టీడీపీకి గండి పడినట్టే.
గత ఎన్నికల్లో నరసాపురం స్థానం నుంచి బీజేపీ గెలుపొందగా.. ఈసారి  కాషాయ పార్టీకి కష్టమే.
2014 ఎన్నికల్లో టీడీపీ మొత్తం 15 స్థానాల్లోనూ, వైఎస్సార్‌సీపీ ఎనిమిది స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లోనూ గెలుపొందిన విషయం తెలిసిందే.  రాయలసీమలోని మొత్తం ఎనిమిది స్థానాల్లో ఐదింటిని వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా... కోస్తాలో టీడీపీ ఎక్కువ సీట్లు సాధించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top