హామీలను నెరవేర్చడంలో ఘోర వైఫల్యం
టీఆర్ఎస్ సర్కార్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. బల్కంపేట రోడ్డులోని పాటిదర్ భవన్లో శనివారం బీజేవైఎం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ హాజరై బీజేవైఎం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కేంద్ర ప్రభుత్వం యువత నిరుద్యోగాన్ని పారదోలేందుకు విభిన్న పథకాలను ప్రవేశపెడుతోందని, వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి యువతకు ఉపాధి చూపించాల్సిన బాధ్యత బీజేవైఎం కార్యకర్తలపై ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
లక్ష ఉద్యోగాల హామీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల రద్దు వంటి వాటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఉద్యమకారులను అణగదొక్కి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేశారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం పెంచేలా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర సర్కార్ చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు
కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ యువమోర్చాకు ఉన్న బలంతోనే బీజేపీ బలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి నైతికంగా బలం లేదని, దేశంలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి మూడు చక్కటి కార్యక్రమాల ద్వారా యువతకు రెండేళ్లలో ఉపాధి అవకాశాలతో పాటు కోటి ఉద్యోగాలు కల్పించనున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, జాతీయ యువమోర్చా అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.