‘పక్కవారిపై బురద చల్లడమే బాబు నైజం’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడికి గల కారణాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జగన్పై హత్యాయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దాడి వెనుక ఉన్న కుట్ర కోణాన్ని నిగ్గు తేల్చాలని తెలిపారు.
ఏ సంఘటన జరిగినా పక్కవారిపై బురద చల్లడం చంద్రబాబు నైజం అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే దానిని పక్కదోవ పట్టించడానికి ఆపరేషన్ గరుడ అని మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఐటీ దాడులపై కూడా రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శించారు. ఈ దాడితోనైనా ఏపీ ప్రభుత్వం నేతల భద్రతపై పునరాలోచించాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ.. జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కారకులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, టీడీపీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆపరేషన్ గరుడ అనేది ఎక్కడా లేదని స్పష్టం చేశారు.