ఓటమి భయంతో మారిన కేసీఆర్ వేషభాషలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వేషభాషలు మారిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం ఇక్కడ సినీనటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్తో కలసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్ఎస్లో గ్రూప్ రాజకీయాలు, అసమ్మతులు పెరుగుతున్నాయని, ఆ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోందన్నారు.
ఎన్నికల్లో గెలిచేం దుకు టీఆర్ఎస్ కోట్లాది రూపాయలు ఖర్చు చేయనుందని, దీనికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. బాబూమోహన్ సేవలను తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగించుకుంటామని తెలిపారు. ఈ నెల 28న మూడో విడత ప్రచారం చేసేందుకు అమిత్ షా రాష్ట్రానికి రానున్నట్లు తెలిపారు. జాతీయ పార్టీ లోకి వస్తానని ఏ రోజూ అనుకోలేదని బాబూ మోహన్ అన్నారు. ఆగమేఘాల మీద బీజేపీలో చేరినట్లు చెప్పారు. తనకెలాంటి సమాచారం ఇవ్వకుండా కేసీఆర్ టికెట్ నిరాకరించారని, దానిపై చాలా మథనపడ్డానన్నారు.