చొరబాటుదారులపై కఠినంగా వ్యవహరించాల్సిందే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఉంటున్న అక్రమ చొరబాటుదారులను గుర్తించి వారిపై కఠినచర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అధికారుల వద్ద వారి సమాచారం ఉన్నా ప్రభుత్వం తీరుతో మెతకగా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మతోన్మాద మజ్లిస్ కారణంగానే రోహింగ్యాలకు హైదరాబాద్ సేఫ్ జోన్గా మారిపోయిందన్నారు. రోహింగ్యాలు హైదరాబాద్లో పౌరులుగా చెలామణి అవు తున్నారని, రేషన్కార్డు, ఓటరు కార్డులు పొందుతున్నారని పేర్కొన్నారు.
ఇటీవల ఎన్ఐఏ బృందం సోదాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, పేలుడుకు సంబంధించిన కెమికల్స్ స్వాధీనం చేసుకోవడం వంటివి చూస్తుంటే ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణ జరుగుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో అరెస్టు అయిన వారికి న్యాయం అందిస్తామని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడం, మజ్లిస్ ప్రాబల్య ప్రాంతాలు వారికి అడ్డాలుగా మారడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఈ నెల 23న గద్వాల్లో బహిరంగ సభ నిర్వహిస్తామని, సెప్టెంబర్లో రెండోదశ బస్సుయాత్ర ఉంటుందన్నారు.