తెలుగు సీఎంలను అసహ్యించుకుంటున్నారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
ఆదిలాబాద్: కర్ణాటక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి పావులుగా మారడంపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం ఆయన ఆదిలాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కర్ణాటక ప్రజల తీర్పు మేరకు యడ్యూ రప్ప సీఎం పదవికి రాజీనామా చేశారన్నారు. తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న కుమారస్వామి సీఎం పదవి కోసం కాంగ్రెస్తో జతకట్టారని ధ్వజమెత్తారు.
కర్ణాటకలో బీజేపీని ఓడించాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలు చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్తో పోరాడుతున్నామని చెబుతున్న కేసీఆర్ లోపాయికారీగా ఆ పార్టీతో చేయికలిపారనడానికి నిదర్శనం.. హైదరాబాద్లో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పించడమేనని అన్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్, కాంగ్రెస్ భాగస్వాములవుతాయన్నారు. ఈ నెల 27, 28వ తేదీల్లో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.