కాంగ్రెస్ను తలపిస్తున్న కేసీఆర్ పాలన: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆశలను వమ్ము చేసేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని, సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పాలనను తలపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన, పోలీసుల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అమెరికా పది రోజుల పర్యటనలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామన్న సీఎం మాటలు నమ్మశక్యంగా లేవని ఎన్నారైలు అభిప్రాయపడుతున్నారని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎన్నారైల సేవలు అవసరమని కోరానని, రానున్న 15 రోజుల్లో కొంతమంది ప్రవాస భారతీయులు బీజేపీలో చేరుతారని తెలిపారు.