పాలన చేతకాకే ముందస్తుకు: లక్ష్మణ్‌

Laxman commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు నెరవేర్చలేకే ప్రభుత్వాన్ని రద్దు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. కొత్త రాష్ట్రాన్ని పాలించే బాధ్యతను ప్రజలు టీఆర్‌ఎస్‌కు అప్పగిస్తే అది చేతకాక సీఎం కేసీఆర్‌ తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారని ఆరోపించారు. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల నిర్ణయం తీసుకోకుండానే కేసీఆర్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.

గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్థంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేయడంపై ప్రజలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీడియా సమావేశంలో ఉత్పన్నమైన ఈ ప్రశ్నలకు సమాధానమివ్వకుండానే దాటవేశారని మండిపడ్డారు. దళితులు, బీసీలు, ఎస్టీలను పాలనలో కేసీఆర్‌ పూర్తిగా విస్మరించారని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన తొలిమాట మొదలు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, ఇంటింటికీ తాగునీరు, పొలాలకు సాగు నీరు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పేదల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని, మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top