‘ఉద్యోగాల కోసం15 లక్షల మంది నిరీక్షణ’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల వాగ్దానంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత నియామకాలను విస్మరించిందని మండిపడ్డారు. సోమవారం బీసీ భవన్లో జరిగిన నిరుద్యోగ జాక్ కార్యవర్గ సమావేశానికి హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి అక్కడ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వల్ల జిల్లాల్లో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. తెలంగాణ నిరుద్యోగ జాక్ చైర్మన్ మాట్లాడుతూ అన్ని శాఖల్లో పోస్టులను భర్తీ చేయకుంటే జూలైలో నిరుద్యోగ సంఘాలతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.