‘కన్ఫ్యూజన్’లో కాంగ్రెస్ పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ లోయలో దాదాపు 70 లక్షల మంది ప్రజలు అసాధారణ సైనిక నిఘా నీడలో బతుకుతున్నారు. ప్రజల మాటా మంతిపై అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎలాంటి నేరారోపణలు దాఖలు కాకుండా వేలాది మంది ఊచల మాటున నిర్బంధంలో ఉన్నారు. మరోపక్క శనివారం నాడు అస్సాం రాష్ట్రానికి సంబంధించి జాతీయ పౌరసత్వ రెండో జాబితా విడుదలయింది. అందులో 19 లక్షల మంది ప్రజల పౌరసత్వం గల్లంతయింది. ఇంకోపక్క ఏప్రిల్–జూలై త్రైమాసికానికి స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) ఐదు శాతానికి పడి పోయింది. ఇలా జీడీపీ రేటు వరుసగా పడిపోవడం నాలుగోసారికాగా, ఇంతగా పడిపోవడం గడచిన ఆరేళ్లలో ఇదే మొదటి సారి. దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటిని నాలుగు ప్రధాన బ్యాంకుల్లో విలీనం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
చదవండి: ఎన్ఆర్సీ అసోం తుది జాబితా; 19.6 లక్షల మంది అవుట్!
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఇప్పటికీ సీబీఐ కస్టడీలో కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ‘కమాండర్ ఇన్ థీఫ్’ అని పిలిచినందుకు రాహుల్ గాంధీకి ముంబై కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఇవన్నీ దేశాన్ని కుదిపేస్తున్న పరిణామాలే. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అసాధారణ మౌనాన్ని పాటిస్తోంది. అసలు ఏమి చేయాలో పాలుపోక తీవ్ర గందరగోళంలో పడిపోయినట్లు ఉంది. కాంగ్రెస్ నాయకుల మధ్య ఎలాంటి సమన్వయం కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీని ముక్కు సూటిగా నిలదీయాల్సిన కాంగ్రెస్ నాయకులు వారిలో వారు పరస్పరం విమర్శించుకుంటున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పదే పదే విమర్శించడం సబబు కాదని, ఆయన పాలనలో పూర్తి ప్రతికూలతేమీ లేదని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ఇటీవల వ్యాఖ్యానించగా, ఆయనకు మేథావులుగా గుర్తింపు పొందిన పార్టీ సీనియర్ నాయకులు శశిథరూర్, మణిశంకర్ అయ్యర్ వంత పాడారు. జైరామ్ రమేశ్పై మరో పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ విరుచుకుపడ్డారు. నిర్ణయాత్మక ప్రతిపక్షంగా సైద్ధాంతిక దక్పథం గురించి చర్చించి ఒక విధాన నిర్ణయానికి రావాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇలా బ్రష్టుపట్టి పోతుందని వారే ఊహించలేక పోవచ్చు. గత లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నానని రాహుల్ గాంధీ ప్రకటించిన నాటి నుంచి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీని మరింత దిగజార్చాయి.
పార్టీ అధ్యక్షులుగా సోనియా గాంధీ తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓ సిద్ధాంతమంటూ లేకుండా పోయినట్లు కనిపిస్తోంది. మాజీ ప్రధాన మంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి శూన్యం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయాల్లో వారు కమ్యూనిస్టులను కలుపుకొని పార్టీకి ఓ మార్గాన్ని చూపారు.
ఇప్పుడు గాంధీలు పార్టీకి సైద్ధాంతికంగా సరైన మార్గాన్ని చూపలేకపోతున్నారు. గాంధీయేతరులెరూ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు సాహసించలేక పోతున్నారు. గత పదేళ్లుగా దేశ రాజకీయల్లో వచ్చిన పరిణామాల కారణంగానే నేడు కాంగ్రెస్ పార్టీలో శూన్యం ఏర్పడింది. సోషల్ మీడియా విస్తరించిన ఈ పదేళ్ల కాలంలో తన పార్టీకంటూ ఓ సిద్ధాంతం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెల్లలేక పోయింది. అదే పాలకపక్ష బీజేపీ ‘జాతీయ వాదం’ తన ప్రధాన విధానంగా ప్రజల్లోకి చొచ్చుకు పోయింది.
ఇలా ‘జాతీయ వాదం’తో తమ రాష్ట్రాల్లోకి చొచ్చుకు వస్తోన్న బీజేపీని ఎలా నిలువరించాలో తెలియక అటు బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్, ఇటు ఒడిశాలో బీజూ జనతాదళ్ తమ సైద్ధాంతిక మూలాలను కోల్పోయాయి. పార్టీకి ఓ సిద్ధాంతాన్ని సిద్ధం చేసుకోవడంలో, ప్రజలను ఆకర్షించడంలో ప్రతిపక్షాలు విఫలమవుతున్నంత కాలం పాలకపక్షం నియంతత్వ పోకడలను నిలువరించడం అసాధ్యం.