‘స్వాహా కూటమి వస్తే కన్నీళ్లు తప్పవు’
సాక్షి, సిరిసిల్ల : స్వాహా కూటమి(మహా కూటమి) అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు తప్పవని అపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రైతులకు కష్టాలు, కన్నీళ్లే మిగులుతాయని వ్యాఖ్యానించారు. ఆ పార్టీలకు అధికార దాహం తప్పా మరోటి లేదన్నారు.
ఒకరికి వ్యతిరేకంగా పుట్టిన మరో పార్టీ నిస్సిగ్గుగా రాజకీయంగా దిగజారిపోయి పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. 119 స్థానాల్లో పోటీ చేసే ప్రజాభిమానం ఉందన్న కోదండరాం, ముష్టి మూడు స్థానాల కోసం కాంగ్రెస్ చుట్టూ ఎందుకు పొర్లుదండాలు పెడుతున్నారని ప్రశ్నించారు. దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల్ని గోస పెట్టి, వందలాది మంది చావులకు కారణమైన కాంగ్రెస్, టీడీపీతో కోదండరాం అంటకాగుతున్నారని విమర్శించారు. నిర్ణయాధికారాన్ని మన చేతుల్లో ఉంచుకుందామో లేక ఢిల్లీలో ఉండే బాస్లకు గులాంలుగా, అమరావతిలో ఉండే బాబుకి బానిసలుగా ఉందామో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు.
మరిన్ని వార్తలు