సమర భేరీ కాదు.. అది అసమర్థ భేరీ : కేటీఆర్
సాక్షి, వేములవాడ : తెలంగాణకు బీజేపీ చేసిందేమి లేదని, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో నిన్న బీజేపీ నిర్వహించిన సమరభేరీపై స్పందిస్తూ ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అది సమర భేరి కాదని ఓ అసర్థ భేరి అని విమర్శించారు. హైకోర్టు విభజనపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రానికి మనుగడే ఉండదన్నారు. కేంద్రం తెలంగాణకు అదనంగా నిధులేమి ఇవ్వలేదని స్పష్టం చేశారు. హక్కుగా రావాల్సిన నిధులను మాత్రమే ఇచ్చిందని, పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిందెవరని ప్రశ్నించారు.
తెలంగాణ సెక్యూలర్ రాష్ట్రమని, ఇక్కడ అన్ని మతాల విశ్వాసలకు అనుగునంగా అందరిని సమానంగా చూసుకుంటూ దేశానికే అదర్శంగా నిలుస్తుందన్నారు. 119 స్థానాల్లో పోటీ చేస్తానన్న అమిత్షాకు ఎన్ని స్థానాల్లో డిపాజిట్స్ వస్తయో చూద్దామని సవాల్ విసిరారు. బీజేపీ ఉన్న ఐదు సీట్లు గెలుచుకుంటేనే ఎక్కువని, ఇలాంటి మాటలు గతంలో చాలా విన్నామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఇలానే చాలా మాట్లాడారని, కానీ వారి నియోజకవర్గంలో ఒక్క కార్పోరేటర్ను కూడా గెలిపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. ఇంకా బీజేపీకి 9 నెలల సమయం ఉందని ఈ లోగా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.