హరీశ్కు సవాల్ విసిరిన కేటీఆర్
సాక్షి, మెదక్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్ రావుకు సవాల్ విసిరారు. మెదక్ పార్లమెంట్ కంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ మెజార్టీ సాధిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మా కరీంనగర్ ఎంపి స్థానం కంటే ఎక్కువ మెజారిటీ సాధించండి. తెలంగాణలో టీఆర్ఎస్కు ఏ పార్టీ పోటీ కాదు. ఇప్పుడు రాష్ట్రంలో అంతా ఏకపక్షమే.
పోటీ ఉన్నదంతా ఒకరితో ఒకరు మెజార్టీలు సాధించే దానిమీదే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కన్నా మేమే ఒక ఓటు అయినా ఎక్కువ తెచ్చుకొని మీ కంటే ముందుంటాం.’ అని అన్నారు. అయితే తన సవాల్ బావతో కాదన్న కేటీఆర్ ... తాను, బావ కలిసే ఉన్నామని, ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. కేటీఆర్ ఈ సందర్భంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డితో సభకు ప్రత్యేకంగా అభివాదం చేయించారు.
అయిదు లక్షల ఓట్ల మెజార్టీ: హరీశ్
అంతకు ముందు హరీశ్రావు మాట్లాడుతూ...కేసీఆర్ కృషి వల్లే మెదక్, సిద్ధిపేట జిల్లాలు ఏర్పడ్డాయన్నారు. రెండు నెలల్లో గజ్వేల్, మెదక్కు రైలు రాబోతుందని, దేశానికే ఆదర్శకంగా గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కేసీఆర్కు కృతజ్ఞత తెలిపాలంటే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈసారి అయిదు లక్షల ఓట్ల మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటుతామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానాన్ని మళ్లీ గెలిపించుకొని అభివృద్ధి పరంపరను కొనసాగించాలని హరీష్ రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.