దానిపై నో కామెంట్: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీలో అందరూ పీసీసీ, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పీసీసీ పదవి అడగటంలో తప్పేమి లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 40 నుంచి 50 మందిని మారుస్తారని, లేకుంటే కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాను పార్టీ పెడతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీజేఏసీ నేత కోదండరాం పార్టీ ఏర్పాటుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాగా, రాజకీయ పార్టీ పెట్టాలని తమపై ఒత్తిడి ఉందని కోదండరాం మంగళవారం తెలిపారు. అయితే పార్టీ ఏర్పాటు విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.