‘కేసీఆర్ కన్నా నాకే ఎక్కువ మెజారిటీ’
నల్లగొండ: ఈ ఎన్నికల్లో కేసీఆర్కు గజ్వేల్లో వచ్చే మెజార్టీకంటే నల్లగొండలో తనకే అధికంగా మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వరుసగా నాలుగు సార్లు నల్లగొండ ప్రజలు తనను గెలిపించారని, ఐదోసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నా రన్నారు. 20 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల వెన్నంటి ఉంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని సైతం లెక్క చేయకుండా రాజీనామా చేసిన విషయం ప్రజలకు తెలియనిది కాదన్నారు. సీఎం కేసీఆర్ నల్లగొండ నియోజకవర్గంలో రూ.100 కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తనపై పోటీ చేసే వ్యక్తికి జై తెలంగాణ అంటే ఏమిటో తెలియదని, అలాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి అని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు