పాలకులు మారకుంటే పతనం తప్పదు
ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు: కోదండరాం
ఎల్లారెడ్డిపేట: తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న పాలకులు మారాలని, లేనిపక్షంలో పతనం తప్పదని ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం టీజేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ, రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆరోపించారు.
పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు కనిపించడంలేదా అని కోదండరాం ప్రశ్నించారు. ఈనెల 29న హైదరాబాద్లో తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ఇన్చార్జి ‘తీన్మార్’మల్లన్న, రైతు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నెగంటి రవి, టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు బొజ్జ కనుకయ్య, సీపీఐ కార్యదర్శి గుంటి వేణు తదితరులు పాల్గొన్నారు.