ఎంఐఎం జోకుడు పార్టీ: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నవారికి జోకుడు అలవాటున్న పార్టీ ఎంఐఎం అని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలసి పోటీచేస్తామని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అంటున్నారని, దీనిపై టీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ వైఖరిని చెప్పాలని అన్నారు.
వేలాదిమంది హిందువులను చంపిన రజాకారుల పార్టీ ఎంఐఎం అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని జోకుతూ, ఎంఐఎం తన ప్రయోజనాలను సాధించుకుంటుందని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును, ఆ తరువాత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడారని అన్నారు. రాష్ట్ర రాజకీయాలను దిగజార్చేవిధంగా టీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో టీఆర్ఎస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందో ప్రజలకు చెప్పాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.