ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా?

kishan reddy commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్యాయాన్ని ప్రశ్నించే వారిని జైలుకు పంపే పాలన సాగుతోందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసిన వారిపై కేసీఆర్‌ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించడమే దీనికి నిదర్శనమన్నారు. పత్రికలను కూడా బెదిరిస్తూ తను చెప్పిందే రాయాలన్నట్లుగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

శనివారం ఇక్కడ జరిగిన బీజేపీ లీగల్‌ సెల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు అనుకూలంగా చట్టాలు రూపొందించుకుంటున్న కేసీఆర్‌ ప్రభుత్వం తీరును అడ్డుకునేందుకు లీగల్‌ సెల్‌ క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఇందుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని సూచించారు.  

ఓటు బ్యాంకు రాజకీయాలను అడ్డుకోవాలి: దత్తాత్రేయ
కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో లీగల్‌ సెల్‌లోని మహిళా న్యాయవాదులు విస్తృత ప్రచారం చేయటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భూసేకరణలో నష్టపోయిన రైతులకు లీగల్‌ సెల్‌ న్యాయవాదులు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

హైకోర్టు విభజన టీఆర్‌ఎస్‌కు ఇష్టం లేదని, బీజేపీ పోరాటం వల్లనే ఇప్పుడు విభజనకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. మంద కృష్ణను ఏ నిబంధన ప్రకారం అరెస్టు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top