చొరబాటుదారులకు మద్దతు సిగ్గుచేటు: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మనదేశంలోకి చొరబడిన వారికి కాంగ్రెస్, ఇతర పార్టీలు మద్ధతు పలకడం, వారికోసం పార్లమెంటునే స్తంభింపజేస్తామడం సిగ్గుచేటని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో చొరబాటుదారులను పెంచి పోషించిందన్నారు. వారి ద్వంద్వనీతి, ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశాన్ని ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ అన్నారు.
హైదరాబాద్లో పరిస్థితి దారుణంగా ఉందని, అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశ్, బర్మా నుంచి వచ్చారన్నారు. బాలాపూర్లో బర్మా కాలనీ ఏర్పడిందన్నారు. హఫీస్బాబానగర్, పహడీషరీఫ్, కిషన్బాగ్లో రోహింగ్యాలు ఎలా నివాసం ఉంటున్నారని ప్రశ్నించారు. వారికి మజ్లిస్ ఎందుకు మద్దతు ఇస్తోందని, కోవాల అనే సంస్థ ఐడెంటిటీ కార్డు ఎలా ఇస్తోందని ప్రశ్నించారు.
కాగా ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టాన్ని యథాతథంగా ఉంచేందుకు కేంద్ర మంత్రివర్గం బిల్లును ఆమోదించడం పట్ల బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ప్రధాని మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామ్చందర్రావులు పాల్గొన్నారు.