కేసీఆర్ మంచివారంటే ఎందుకంత కడుపుమంట: అంబటి
సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పద్ధతి సరిగా లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సభను సజావుగా నడుస్తున్న సమయంలో...ప్రతిపక్ష నేత సమావేశాలను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. సభా నాయకులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గోదావరి జలాలపై మాట్లాడుతుండగా మధ్యలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేచి గందరగోళం సృష్టించారని, స్పీకర్ పోడియం చుట్టుముట్టేలా చంద్రబాబే వారిని ఉసిగొల్పారన్నారు. సభా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచివారన్నారు తప్ప చంద్రబాబు చెడ్డవాడని చెప్పలేదని చురకలు అంటించారు. కేసీఆర్ మంచివారంటే ఎందుకంత కడుపుమంట అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి రెట్లు మంచివారని అంబటి అన్నారు. చంద్రబాబు చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారన్నారు. శాసనసభలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతిని మార్చుకుంటే బాగుంటుందని హితవు పలికారు. టీడీపీ సభ్యులు సభను తప్పదారి పట్టించాలని చూస్తున్నారని అంబటి దుయ్యబట్టారు.
సంబంధిత వార్తలు