గెలుపు వ్యూహాలపై చర్చిద్దాం

KCR special meeting tomorrow with TRS candidates - Sakshi

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో రేపు కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం

ప్రచారంలో అనుసరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేయనున్న సీఎం

తప్పకుండా హాజరు కావాలని 105 మంది అభ్యర్థులకూ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం గులాబీ దళం దూకుడు పెంచింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారపర్వంలోకి దింపిన గులాబీ దళపతి... వారికి మరింత జోష్‌ ఇచ్చేందుకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థులతో టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ మేరకు 105 మంది అభ్యర్థులు తప్పకుండా హాజరు కావాల్సిందిగా పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దాదాపు నెల రోజులుగా క్షేత్రస్థాయిలో ప్రచారంలో ఉన్న అభ్యర్థులతో కేసీఆర్‌ లోతుగా చర్చించనున్నారు. ప్రచారంలో ఎదురైన పరిస్థితులను తెలుసుకుని పక్కా వ్యూహాల అమలుపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఇప్పటికే సూచనలు చేస్తున్న అధినేత... తాజాగా స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలను అనుసరిస్తూ చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలను వారికి వివరించనున్నారు. 

చేసింది వివరిద్దాం.... చేసేది చెబుదాం... 
తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టోపై ఇటీవల కొంత స్పష్టత వచ్చింది. ప్రాథమిక వివరాలను కేసీఆర్‌ ఇటీవల మీడియా సమావేశంలో వివరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే అభ్యర్థుల సమావేశంలో దీనిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలోని అంశాలపై ప్రజాస్పందన ఎలా ఉందనే దానిపై విశ్లేషించే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గాలవారీగా లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య... సంక్షేమ కార్యక్రమాల తాలూకు ఫలితాలను ప్రచారంలో భాగంగా ప్రజలకు వివరించాలని ఇప్పటికే పార్టీ అధినేత అభ్యర్థులకు సూచించారు.

ఈ మేరకు వారితో క్రమం తప్పకుండా ఫోన్లో మాట్లాడుతున్న అధినేత... ఆదివారం ముఖాముఖిలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రాథమిక అంశాలను జోడిస్తే వారికి కలిగే మేలు ఎలా ఉంటుందనే అంశాన్ని సూక్ష్మంగా వివరించేలా అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నారు. ప్రాథమిక మేనిఫెస్టోపై ప్రజలేమనుకుంటున్నారు... ఇంకా ఎలాంటి సంక్షేమాన్ని వారు కోరుకుంటున్నారనే దానిపై అభ్యర్థులను అడిగి తెలుసుకోనున్నారు. ఇదే క్రమంలో ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనలను అధినేతకు అభ్యర్థులు వివరించనున్నారు. 

సర్దుబాటుతో వెళ్లేలా... : ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి అసమ్మతిరాగం ఎదురైంది. ఈ క్రమంలో చాలాచోట్ల బుజ్జగింపులు చేస్తున్నప్పటికీ ఆ ప్రభావం కనిపించడంలేదు. కొన్నిచోట్ల టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదనే అంశం అధినేత దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో వారితో ఎలా సర్దుబాటు చేసుకోవాలనే విషయమై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. స్థానిక నాయకత్వ మంతా సమైక్యంగా ప్రచారం చేస్తేనే అద్భుత ఫలితాలు వస్తాయనే ధోరణితో వెళ్లాలని అభ్యర్థులకు కేసీఆర్‌ సూచించొచ్చని తెలుస్తోంది. ప్రతిపక్షాలను సైతం ఎండగెట్టే అంశంపైనా సుదీర్ఘ చర్చ జరపనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే వ్యూహాలనూ అధినేత వివరించనున్నారు.సామాజిక మాధ్యమాల వినియోగంపైనా సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top