ఊరూరూ తిరగాలి

KCR Public Meetings In Hyderabad And Miryalaguda - Sakshi

భారీ మెజారిటీతో ఎంపీ సీట్లు గెలవాలి.. టీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఇన్‌చార్జిలకు కేసీఆర్‌ ఆదేశం

ఏప్రిల్‌ 1లోగా ఒక దశ ప్రచారం పూర్తి చేయాలి

ఈ బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలదేనని స్పష్టీకరణ

ప్రచార వ్యూహంపై పలువురు మంత్రులతో ఫోన్లో మంతనాలు

నేడు మిర్యాలగూడ, హైదరాబాద్‌ సభల్లో పాల్గొననున్న సీఎం  

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీ మెజారిటీ లక్ష్యంగా ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించాలి. పక్కా ప్రణాళిక రూపొందించుకొని ప్రతి గ్రామంలోనూ ప్రచారం చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపని ప్రాంతాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించి అక్కడి సమస్యలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలి. దీనివల్ల లోక్‌సభఎన్నికల్లో మెజారిటీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది.     – కేసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఎప్పటికప్పుడు వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భారీ మెజారిటీ రావాలని ఎన్నికల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులను ఆదేశిం చారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురువారం పలువురు మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. అన్ని సెగ్మెంట్లలోనూ భారీ మెజారిటీతో విజయం సాధించేలా ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు వారి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను తీసుకోవాలని సూచించారు.

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీ మెజారిటీ లక్ష్యంగా ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించా లన్నారు. పక్కా ప్రణాళిక రూపొందించుకొని ప్రతి గ్రామంలోనూ ప్రచారం చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైనా టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపని ప్రాంతాలు ఉంటే గుర్తించి అక్కడి సమస్యలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని సూచించారు. దీనివల్ల లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ పెరిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళిపై ప్రజల్లో స్పందన ఎలా ఉందని కేసీఆర్‌ వివిధ మార్గాల్లో సమాచారం సేకరిస్తున్నారు. పలు సర్వే సంస్థలకు ఈ పని అప్పగించారు. అన్ని రకాల సమాచారం అందిన తర్వాత ప్రజల్లో వచ్చిన స్పందనను బట్టి తదుపరి ప్రచార కార్యాచరణను రూపొందిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా అనుసరించే వ్యూహాలను మంత్రుల ద్వారా ఎమ్మెల్యేలకు చెబుతున్నారు.

వేగం పెంచాలి...
టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థుల ప్రచార సరళిపైనా సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోక్‌సభ సెగ్మెంట్లవారీగా అభ్యర్థుల ప్రచార తీరు ఎలా ఉందని వివిధ రూపాల్లో సమాచారం సేకరిస్తు న్నారు. ఇలా వచ్చిన సమాచారం ఆధారంగా పలు వురు అభ్యర్థులతో, ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌కు ఎన్ని కల ఇన్‌చార్జీలుగా ఉన్న మంత్రులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్‌ బలాబలాలు, ప్రత్యర్థి పార్టీల పరిస్థితిని వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం పెరిగేందుకు అవసరమైన ప్రచార వ్యూహంపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను గ్రామాలవారీగా తెలియజేయాలని సూచిస్తున్నారు. ఏప్రిల్‌ 1లోగా అన్ని లోక్‌సభ సెగ్మెంట్లలో ఒక దశ ప్రచారం పూర్తి చేయాలని ఆదేశించారు. వెంటనే మరోసారి సెగ్మెంట్‌ మొత్తం తిరిగేలా ప్రచార షెడ్యూల్‌ రూపొందించుకోవాలని సూచించారు. నగరాలు, పట్టణాలు ఉన్న లోక్‌సభ సెగ్మెంట్లలో ప్రచార సరళి నెమ్మెదిగా సాగుతోందని, ఈ ప్రాంతాల్లో వ్యూహం మార్చాలని పలువురు మంత్రులను ఆదేశించారు.

నేటి నుంచి కేసీఆర్‌ ప్రచారం...
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల పూర్తి స్థాయి ప్రచారం శుక్రవారం నుంచి మొదలవుతోంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మిర్యాలగూడలో జరగనున్న నల్లగొండ లోక్‌సభ సెగ్మెంట్‌లో జరిగే టీఆర్‌ఎస్‌ ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవేళ్ల సెగ్మెంట్లలోని నగర ప్రాంత పరిధి బహిరంగ సభకు హాజరవుతారు.

నేడు కరీంనగర్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో...
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారాక రామారావు శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట, వీరన్నపల్లి మండలాల్లో ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు కరీంనగర్‌లో రోడ్‌ షోలో పాల్గొంటారు. అనంతరం కరీంనగర్‌లో నిర్వహించే టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో పాల్గొంటారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top