రేవంత్ టీడీపీ కోవర్టు
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: రేవంత్ కాంగ్రెస్లో టీడీపీ కోవర్టని, కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తానని ప్రకటించిన చంద్రబాబు దానికోసమే రేవంత్ను కాంగ్రెస్లోకి పంపాడని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే మంచిదని సూచిం చారు.
శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సెక్రటరీల నియామకాన్ని హైకోర్టు కొట్టేసిందని, రాష్ట్రంలో ఇప్పుడు పార్లమెంటరీ సెక్రటరీలు లేరని, అది ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. రేవంత్ వంటి అవగాహనలేని నేతలు కొందరు దాన్నొక సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం కావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబట్టారు. ఇండియాటుడే కాంక్లేవ్లో సీఎం కేసీఆర్ దేశమే అబ్బురపడేలా మాట్లాడారని, సీఎం ప్రతిష్ట మరింత పెరిగిందన్న దుగ్ధతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. మోత్కుపల్లి నర్సింహులు టీడీపీలో సీనియర్ నాయకుడని, ఆయన చేసిన విలీన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.