మీరేమైనా చట్టానికి అతీతులా?
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాన్ బెయిలబుల్ వారెంటును రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ నేతలపై కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే.. ప్రధాని మోదీ, అమిత్ షాల, మహారాష్ట్ర సీఎంపై ఆరోపణలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థంతోనే చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీతో అనైతిక పొత్తుకు సిద్ధపడ్డారని దుయ్యబట్టారు. సీఎం అయినంత మాత్రాన నాన్ బెయిలబుల్ రాకూడదా.. చట్టాన్ని మీరిన ఎవరిపైనైనా ఇటువంటి చర్యలు తప్పవన్నారు. పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వారెంటు పేరిట చంద్రబాబు కొత్త నాటకాలు మొదలుపెట్టారని ఆంజనేయ రెడ్డి విమర్శించారు.
చట్టాల్లో కేంద్రం వేలు పెట్టడం లేదు..
ఆపరేషన్ గరుడ అంటూ శివాజీ మాట్లాడుతుండడం దారుణంగా ఉందని ఆంజనేయ రెడ్డి అన్నారు. దర్యాప్తు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, చట్టాల్లో కేంద్రం వేలు పెట్టడం లేదని పేర్కొన్నారు. సాధారణ అంశాన్ని జాతీయ సమస్యగా చేసి ప్రజలను రెచ్చగొట్టి సానుభూతిని సంపాదించాలనుకుంటే కుదరదని హెచ్చరించారు.