కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి షాక్..!
బెంగళూరు: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఉమేశ్ జాధవ్ సోమవారం పార్టీ స్వభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ.. స్పీకర్కు లేఖ సమర్పించారు. చించోలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో జాదవ్కు కలబురిగి నియోజకవర్గం టికెట్ను బీజేపీ ఇవ్వనుందని, బుధవారం ప్రధాని మోదీ కలబురిగి పర్యటన సందర్భంగా ఈ మేరకు లాంఛనంగా పార్టీలో చేరనున్నారని స్థానికంగా కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార మిత్రపక్షమైన జేడీఎస్తో తీవ్ర విభేదాలు ఎదుర్కొంటోంది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేసిందని ఆ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా తాను దళితుడు కావడం వల్ల తనకు మూడుసార్లు సీఎం పదవి నిరాకరించారని, తాను ఉప ముఖ్యమంత్రి పదవిని అసంతృప్తితోనే నిర్వహిస్తున్నానని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీ పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీని కుదిపేస్తున్నాయి.