సంక్షోభం దిశగా కర్ణాటక ప్రభుత్వం
బెంగళూరు : జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభం దిశగా పరుగులుపెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. నేడు మరో ఎనిమిది మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు బీసీ పాటిల్, మునిరత్న, ప్రసాద గౌడ పాటిల్, శివరామ, రామలింగా రెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్, రమేశ్ జక్కహళ్లిల రాజీనామాలతో కర్ణాటక ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక వ్యవహారాల ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ను కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రానికి పంపనుంది.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి రేపు రాత్రి బెంగళూరు చేరుకోనున్నారు. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉండగా బీజేపీ 105, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37, బీఎస్పీ 1, ఇతరులు 2 ఉన్నాయి. ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సంకీర్ణ ప్రభుత్వ బలం మరింత తగ్గనుంది.