ప్రధానిపై కమల్ సంచలన వ్యాఖ్యలు
రాజకీయ లబ్ధికే నోట్ల రద్దు
మోదీకి మద్దతు ఇచ్చి తప్పు చేశా: కమల్ హాసన్
సాక్షి, చెన్నై: తమిళ నటుడు కమల్ హాసన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖాయం అవడంతో కమల్ హాసన్ రాజకీయ నాయకులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గతంలో తనతోటి నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్తో పాటు, ఇతర పార్టీ నాయకులను ఆయన విమర్శించారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రంపై విరుచుపడ్డారు. గతంలో నోట్ల రద్దుపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని తొందరపడి సమర్దించడం తాను చేసిన పెద్ద తప్పు అన్నారు. నోట్ల రద్దుపై సమర్దించినందుకు ప్రజలు తనను క్షమించాలని కోరారు. కేవలం ధనవంతుల కోసం మాత్రమే మోదీ నోట్లురద్దు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దుతో కేవలం రాజకీయ నాయకులకు లబ్ది జరిగిందే తప్ప సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు.
మోదీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రజలెంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తుంటే బాధేస్తుందన్నారు. దీనిపై కామ్రేడ్ నాయకులు, మిత్రులు ముందే తనని హెచ్చరించారని, అయినా వారిమాట పెడచెవిన పెట్టి మోదీకి మద్దతిచ్చి తప్పుచేశానని కమల్ హాసన్ అన్నారు.
మరిన్ని వార్తలు